
టిడ్కో గృహాలకు మోక్షమెప్పుడో?
● సంక్రాంతికే ఇస్తామన్న మంత్రి పార్థసారథి
● ఆరు నెలలు గడిచినా వాటి ఊసే లేదు
నూజివీడు: పట్టణ పరిధిలోని టిడ్కో గృహాలు లబ్ధిదారులకు ఎప్పటికి అందుతాయోనని ఎదురుచూస్తున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకొని టిడ్కోకు చెల్లించి రెండేళ్లు గడిచినా ఇంతవరకు తమకు గృహాలు అప్పగించకపోగా, ఇచ్చిన రుణాలపై రెండేళ్ల మారటోరియం పూర్తికావడంతో రుణాలు ఇచ్చిన బ్యాంకర్లు ఈఎంఐలు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. 2014–19 కాలంలో పాలించిన టీడీపీ ప్రభుత్వం టిడ్కో గృహాల పథకాన్ని తీసుకువచ్చింది. దీనిలో భాగంగా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకకానికి జతగా రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులను ఇచ్చి టిడ్కో గృహాల నిర్మాణాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా నూజివీడు పట్టణంలో అప్పట్లో 3070 గృహాలను మంజూరు చేశారు. నిర్మాణం పూర్తయిన ప్లాట్లు 2640 ఉన్నాయి. వీటిల్లో 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 864, 365 చదరపు అడుగుల(సింగిల్ బెడ్రూమ్) విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 864, 430 చదరపు అడుగుల (డబుల్ బెడ్ రూమ్) ప్లాట్లు 912 చొప్పున ఉన్నాయి.
సంక్రాంతిలోగా ఇస్తామన్నారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి గతేడాది జులైలో నూజివీడులో పర్యటించిన సమయంలో పట్టణంలోని టిడ్కో గృహాల ప్లాట్లను సంక్రాంతి కల్లా అందిస్తానని ప్రకటించారు. దీంతో లబ్ధిదారులందరూ తమ ప్లాట్లు చేతికొస్తాయని సంతోషించారు. సంక్రాంతి వచ్చింది..పోయింది తప్ప లబ్ధిదారులకు ప్లాట్లు మాత్రం చేతికి రాలేదు. సంక్రాంతి పోయి ఆరు నెలలు గడిచినా టిడ్కో గృహాల ఊసే లేదు. దీంతో ఇంకెంత కాలం ఎదురుచూడాలోనని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఉచితంగా ఇచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం
నూజివీడులో ఉన్న 2640 పాట్లలో 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు 864 ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి లబ్ధిదారులు బ్యాంకర్ల నుంచి రూ.2.72 లక్షల రుణాన్ని తీసుకొని టిడ్కోకు చెల్లించాల్సి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ప్లాట్లు వచ్చిన లబ్దిదారులకు సంబంధించిన రుణాన్ని మాఫీ చేశారు. లబ్ధిదారుల నుంచి ఒక్క రూపాయి మాత్రమే కట్టించుకొని వారి పేరున ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసింది. వారికి కూడా ప్లాట్లను ఇంత వరకు అప్పగించలేదు.
పనులే ప్రారంభం కాలేదు
టిడ్కో గృహాల సముదాయ ప్రాంతంలో ఇంతవరకు రోడ్ల నిర్మాణ పనులు, డ్రైనేజీ నిర్మాణ పనులే ప్రారంభం కాలేదు. ప్లాట్లలో ఇంకా కొన్ని పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. విద్యుత్ వైరింగ్, రంగులు వేయడం, మరుగుదొడ్లు, బాత్రూమ్లు తయారు చేయడం, తలుపులు పెట్టడం తదితర పనులు చేయాల్సి ఉంది. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఎన్నికల ముందు టిడ్కో గృహాలను అధికారంలోకి రాగానే అప్పగిస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఇంత వరకు వాటి గురించి పట్టించుకోకపోవడంపై లబ్దిదారులు అసంతృప్తి వ్యక్తమవుతోంది.
టిడ్కో గృహాలు అందజేయాలి
పట్టణంలోని టిడ్కో గృహాలను లబ్ధిదారులకు త్వరగా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఏడాది గడిచినా ప్రభుత్వం అమలు చేయలేదు. లబ్ధిదారులపై రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. లక్షలాది రూపాయలు రుణాలు తీసుకున్న లబ్ధిదారులకు వడ్డీ భారం పెరిగిపోయే అవకాశాలున్నాయి.
జీ రాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, నూజివీడు

టిడ్కో గృహాలకు మోక్షమెప్పుడో?

టిడ్కో గృహాలకు మోక్షమెప్పుడో?