
నాణ్యమైన ఆహారం అందించాలి
ఏలూరు (టూటౌన్): వసతి గృహాంలోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ అమీనాపేట ఏటిగట్టున ఉన్న సాంఘిక సంక్షేమ సమీకృత బాలుర వసతి గృహాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలలకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వసతి గృహం కిటికీలకు దోమల మెష్ లేకపోవడం వల్ల దోమల బెడద ఉంటుందని విద్యార్థులు తెలిపారని, ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. వసతి గృహానికి రాని విద్యార్థుల వివరాలు సేకరించి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, తిరిగి పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
చింతలపూడి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందినట్లు ఎస్సై సతీష్కుమార్ బుధవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగంపాలెం గ్రామానికి చెందిన తులిమెల్లి త్రినాథ్ (24) చింతలపూడి వైష్ణవి మెడికల్ షాప్లో సేల్స్మేన్గా పని చేస్తున్నాడు. ఈ నెల 5న రాత్రి మెడికల్ షాప్ కట్టి ద్విచక్రవాహనంపై స్వగ్రామం లింగపాలెం బయలుదేరాడు. చింతలపూడి బైపాస్ రోడ్డు వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ అదుపుతప్పి గుంతలో పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. స్థానికులు యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించి మెరుగైన చికిత్సకోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ త్రినాథ్ చనిపోవడంతో మృతుని తండ్రి తులిమెల్లి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఉర్దూ పాఠశాల వివాదంపై ఆర్జేడీ విచారణ
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మాకా) ఉర్దూ పాఠశాల, తూర్పువీధి ఉర్దూ పాఠశాలల్లో జరుగుతున్న వివాదాలపై పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జి.నాగమణి బుధవారం విచారణ నిర్వహించారు. తొలుత ఆ రెండు పాఠశాలల్లోని ఉపాధ్యాయులతో ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే మాధ్యమంలోనే బోధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల నుంచి రెండు మాధ్యమాల్లో బోధిస్తామని లేఖలు రాయించుకున్నారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విచారణలో జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ పాల్గొన్నారు.

నాణ్యమైన ఆహారం అందించాలి