ఇంటర్‌ లింక్‌తో నిరంతర విద్యుత్‌ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ లింక్‌తో నిరంతర విద్యుత్‌

Jun 10 2026 1:07 AM | Updated on Jun 10 2026 1:07 AM

హన్మకొండ: అంతరాయం లేని విద్యుత్‌ సరఫరా కోసం టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం సబ్‌స్టేషన్ల మధ్య ఇంటర్‌ లింక్‌ సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇందులో భాగంగా సబ్‌స్టేషన్లను అనుసంధానిస్తూ ప్రత్యామ్నాయ విద్యుత్‌ లైన్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటివరకు హనుమకొండ సర్కిల్‌ (జిల్లా)లో రెండు 33/11 కేవీ సబ్‌స్టేషన్ల మధ్య ఇంటర్‌ లింకింగ్‌, వరంగల్‌ సర్కిల్‌ (జిల్లా)లో ఐదు 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు ఇంటర్‌ లింకింగ్‌ సౌకర్యం కల్పించారు. ఏదైనా ఒక సబ్‌స్టేషన్‌, విద్యుత్‌ లైన్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినా, ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక కారణాలతో ఏర్పడే విద్యుత్‌ అంతరాయాలను నివారించడానికి ఆధునిక ఇంటర్‌లింక్‌ లైన్‌ (అనుసంధాన) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఒక విద్యుత్‌ లైన్‌లో లోపం ఏర్పడితే ఆ పరిధిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. అయితే, ఇంటర్‌లింక్‌ లైన్‌ వ్యవస్థ ద్వారా ఒక 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను మరో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌తో, ఒక 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను సమీపంలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌తో, అలాగే ఒక 33 కేవీ లైన్‌ను మరో 33 కేవీ లైన్‌తో అనుసంధానించి కోతలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తారు. దీని ఫలితంగా ఒక మార్గంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే వెంటనే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా విద్యుత్‌ను సరఫరా చేస్తారు. దీంతో విద్యుత్‌ అంతరాయం గణనీయంగా తగ్గడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో కూడా నిరంతర విద్యుత్‌ సరఫరా ఉంటుంది.

సబ్‌స్టేషన్ల మధ్యప్రత్యామ్నాయ లైన్‌ నిర్మాణం

సాంకేతిక కారణాలతో ఏర్పడే అంతరాయానికి చెక్‌

Advertisement
 
Advertisement
Advertisement