రామన్నపేట : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భిణుల నమోదు, ప్రసవాలు, వ్యాధి నిరోధక టీకాల వివరాలను యువిన్ పోర్టల్లో తప్పకుండా నమోదు చేయాలని జిల్లా వైద్యాధికారి ఎ.అప్పయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాలోని బర్త్ డెలివరీ పాయింట్ ప్రైవేట్ ఆస్పత్రుల డాటా ఎంట్రీ ఆపరేటర్లకు యువిన్, హెచ్ఎంఐఎస్ ఆన్లైన్ పోర్టల్లో రిపోర్టుల నమోదుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. గర్భిణుల వివరాలు నమోదు చేయడం ద్వారా వారిని ఫాలోఅప్ సేవలు, పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చిన వివరాలతో పాటు ఇంకా మిగిలిన టీకాల, అలాగే వివిధ కార్యక్రమాల ప్లానింగ్ కోసం ఈ డేటా ఉపయోగపడుతుందన్నారు. యువిన్ కోఆర్డినేటర్ జ్యోత్స్న, వ్యాక్సిన్ కోల్డ్ చైన్ల మేనేజర్ శిరీష, డిస్ట్రిక్ట్ డాటా మేనేజర్ ప్రవీణ్ ఆన్లైన్ పోర్టల్ సంబంధించిన వివరాలపై శిక్షణ ఇచ్చారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి జ్ఞానేశ్వర్, మాతాశిశు సంక్షేమం ప్రో గ్రాం అధికారి రుబీనా అఫ్రోజ్, ప్రసన్నకుమార్, అశోక్ రెడ్డి, స్వప్న మాధురి పాల్గొన్నారు.
అమృత్ భారత్ పనుల తనిఖీ
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే జంక్షన్లో చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పునరాభివృద్ధి పనులను సికింద్రాబాద్ సెంట్రల్ డివిజనల్ ఇంజనీర్ (డీఈఎన్) ప్రంజల్ కేశర్వాణి బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్ ఎదుట గల సర్క్యులేటింగ్ ఏరియాలో పనులు తనిఖీ చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. కాజీపేట రైల్వే వర్క్స్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎస్.శ్రీనివాసులు, సూపర్వైజర్ పి.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
రేపటినుంచి
‘పది’ సప్లిమెంటరీ పరీక్షలు
విద్యారణ్యపురి : పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 5వతేదీ నుంచి 12వ తేదీవరకు నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లా పరిధిలో ఫెయిల్ అయిన 197 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ బుధవారం తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హై స్కూల్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసి, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్ను నియమించారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉదయం 9:35 గంటల వరకు మాత్రమే అనుమతి ఉందని, అనంతరం పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోరని వివరించారు. హాల్టికెట్లు అధికారిక వెబ్సైట్ బీఎస్ఈ తెలంగాణ.గౌట్.ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.
గ్రామ, వార్డు సభలను
విజయవంతం చేయాలి
హన్మకొండ అర్బన్ : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో బుధవారం రాత్రి వివిధ శాఖల అధికారులతో ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 4, 6, 8, 10 12 తేదీల్లో నిర్దేశించిన సమయానికి సభలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీపీఓ లక్ష్మీరమాకాంత్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


