ఎంజీఎంలో గందరగోళం!
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రి పాలన రోజురోజుకూ అధ్వాన్న స్థితికి చేరుకుంటోంది. పూర్తి స్థాయి పరిపాలనాధికారుల అధికారుల లేమితో, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్థాయి వైద్యులను ఆర్ఎంఓలుగా నియమించుకుని కీలక బాధ్యతలు అప్పగించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆస్పత్రిలో రోగులకు అందించాల్సిన ఔషధాలు, రక్త పరీక్షలు, రోగులకు అందించాల్సిన పారిశుద్ధ్యం వంటి టెండర్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పూర్తి చేయడంలో సూపరింటెండెంట్ స్థాయి అధికారికి ఆర్ఎంఓ–1, ఆర్ఎంఓ–2 వంటి అధికారుల సహాయం తప్పనిసరి. రోగులకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందడం, వారికి సంబంధించి ఎంఓయూలను పరిశీలిస్తూ నిబంధనలు ఎలా పాటిస్తున్నారు అనే అంశాలు పరిశీలిస్తూ బిల్లులు చెల్లింపుల్లో కీలకంగా వ్యవహరిస్తూ రోగులకు మెరుగైన సేవలందించాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఎంజీఎంలో ఇలాంటి ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో రెండేళ్లుగా సర్జికల్, మెడికల్ టెండర్స్తో పాటు ఆస్పత్రిలో పేషెంట్ కేర్ సేవలు అధ్వాన్న స్థితికి చేరుకున్నాయి.
20 నెలలు గడుస్తున్నా పూర్తికాలే..
ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య సేవల్లో రోగులకు ఔషధాలు అందించడం కీలకం. ఆస్పత్రిలో చికిత్స పొందే వేలాది మంది రోగులకు సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పూర్తిస్థాయిలో మందులు సరఫరా కాని క్రమంలో ఆస్పత్రిలో సర్జికల్, మెడికల్ విభాగాల్లో టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా రోగులకు ఔషధాలను సరఫరా చేస్తారు. గత 20 నెలల క్రితం టెండర్ సమయం ముగిసింది. ఈప్రక్రియను పూర్తి చేయడంలో పరిపాలనాధికారులు పూర్తిస్థాయిలో విఫలం కావడంతో రోగులకు పూర్తిస్థాయిలో ఔషధాలు అందకపోవడంతో పాటు, కొన్ని రక్తపరీక్షలకు సైతం ప్రైవేట్కు పరుగులు తీయక తప్పట్లేదు.
స్టేషనరీ విభాగం పరిస్థితి అంతేనా?
ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు చికిత్సలు అందించే విషయంలో ఔషధాలతో పాటు స్టేషనరీ విభాగం సైతం కీలకమే. ఈ విబాగం ద్వారా రోగులకు కేస్షీట్లు, ఓపీ స్లిప్లు, వార్డులకు సంబంధించిన ఎలక్ట్రిక్ సామగ్రి, ఫర్నిచర్, పెన్నులు, బుక్లు వంటి ఇతరత్రా సామగ్రి కొంటుంటారు. స్టేషనరీ విభాగ టెండర్ను సైతం పూర్తిచేయడంలో పరిపాలనాధికారులు వైఫల్యం చెందారు.
ముగిసిన ఐహెచ్ఎంఎస్ టెండర్
ఎంజీఎం ఆస్పత్రిలో మరో కీలక విభాగం పారిశుద్ధ్య సేవలు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనసాగుతున్న ఏజెన్సీ సమయం మూడు నెలల క్రితమే ముగిసింది. వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని పలు కార్మిక సంఘాలు సూపరింటెండెంట్కు వినతి పత్రాలు సైతం అందించాయి. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఏజెన్సీ నిర్వాహకులు ఎంఓయూలో పేర్కొన్నట్లుగా కూడా వేతనాలు చెల్లించట్లేదని ఎన్ని సార్లు పరిపాలనాధికారులకు మొరపెట్టుకున్నా.. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏజెన్సీ పర్యవేక్షించే ఆర్ఎంఓ స్థాయి అధికారులు రోగులకు సేవలందించే పేషెంట్ కేర్, పారిశుద్ధ్య సేవలు పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం కొనసాగుతున్న కార్మికులకు పని ఒత్తిడి సైతం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి కాని సర్జికల్, మెడికల్ టెండర్స్
అధ్వాన స్థితిలో పేషెంట్ కేర్ సేవలు
పట్టించుకోని పాలనాధికారులు


