సాధారణ ప్రసవాలపై గర్భిణులకు వివరించాలి..
ఎంజీఎం: మొదటిసారి గర్భం దాల్చి పరీక్షలకు వచ్చిన మహిళలకు సాధారణ ప్రసవాల వల్ల కలిగే లాభాలు, సీజేరియన్ ఆపరేషన్ల వల్ల తల్లీబిడ్డకు కలిగే నష్టాల గురించి కౌన్సెలింగ్ నిర్వహించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్యులకు సూచించారు. సోమవారం నగరంలోని దేవిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా హాస్పిటల్లో సీ సెక్షన్ ఆడిట్ నిర్వహించారు. ఇందులో భాగంగా నవంబర్ నెలలో మొత్తం 39 ప్రసవాలు జరగగా.. వాటిల్లో 38 సీ సెక్షన్, 1 నార్మల్ ప్రసవాలు చేసినట్లు గుర్తించి ఎందుకు అన్ని సిజేరియన్ ఆపరేషన్లు చేశారని వైద్యులను ప్రశ్నించారు. అనంతరం డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. గర్భిణలకు నార్మల్ డెలివరీ అయ్యేలా వ్యాయామం, యోగా వంటి శిక్షణ ఇవ్వాలన్నారు. తప్పనిసరి పరిస్థితులు, సూచించిన కారణాల్లో మాత్రమే సిజేరియన్ నిర్వహించాలన్నారు. ఆయన వెంట మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ రుబీనా, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, హెచ్ఈఓ రాజేశ్వర్ రెడ్డి, సందీప్ పాల్గొన్నారు.
వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా సి.రామును నియమిస్తూ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాము బాధ్యతలు స్వీకరించారు. తదుపరి నియామకాలు జరిగే వరకు ఉమ్మడి వరంగల్కు రాము అదనపు ఇన్చార్జ్గా కొనసాగుతారని తెలిపా రు. సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంతోషి.. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా కొనసాగుతారని నియామక ఆదేశాల్లో పేర్కొన్నారు.
భూ కబ్జాపై సమగ్ర
నివేదిక కోరిన కలెక్టర్ శబరీష్
హన్మకొండ అర్బన్: నగరంలోని వడ్డేపల్లి ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారంపై సమగ్ర వివరాలతో ‘పెద్దలా.. గద్దలా’ శీర్షికతో సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనం జిల్లాలో సంచలనం రేపింది. దీనిపై స్పందించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. ఆ భూమిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలో దిగిన హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి సంబంధిత వ్యక్తులను భూమికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. ఆ వివరాలతోపాటు రెవెన్యూ రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయి వాస్తవాలను కలెక్టర్ నివేదిస్తానని ఆయన పేర్కొన్నారు. కాగా, అక్కడ రెవెన్యూ రికార్డులు ప్రకారం మూడు గంటల ప్రభుత్వ భూమి ఉందన్నారు. ఈ విషయంలో అక్కడ బోర్డు ఏర్పాటు చేయగా కొందరు తొలగించారన్నారు. ఈ విషయంలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం భూమి ఎక్కడ ఉన్నా అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీపీ సన్ప్రీత్సింగ్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రంనుంచి రాత్రి వరకు ఆకస్మిక తనిఖీలు జరిగాయి. పలుచోట్ల సీపీ స్వయంగా తనిఖీల్లో పాల్గొన్నారు. పోలీస్ అధికారులు వాహనాలతోపాటు ఇళ్లలో కూడా సోదాలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వైరెనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కోరారు.
సాధారణ ప్రసవాలపై గర్భిణులకు వివరించాలి..


