
‘నాసిరకం’ పరేషాన్!
సాక్షి, వరంగల్: జిల్లాలో వారం రోజుల నుంచి ఆడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పత్తి మొక్కలు సారవంతంగా ఎదిగేందుకు ఎరువులు, పెస్టిసైడ్స్ వినియోగించేందుకు రైతులు ఆరాటపడుతున్నారు. మరోవైపు ఫర్టిలైజర్ మార్కెట్లో నకిలీ, కాలం చెల్లిన పెస్టిసైడ్ అమ్ముతూ కొందరు వ్యాపారులు టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కుతుండడం కలవరపెడుతోంది. అన్నదాతలు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని కొందామనుకున్నా ఏదో ఒక సందర్భంలో ఈ నకిలీ బారినపడి పంటను చేజార్చుకున్న ఘటనలు కొకొల్లలు. అయితే రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందేలా చూడాల్సిన వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పెద్దగా పట్టించుకోకపోవడంతో ఈనకిలీ బెడద ఎక్కువవుతోందని రైతుల్లో ఆందోళన ఎక్కువవుతోంది.
ఇటీవల టాస్క్ఫోర్స్ దాడుల్లో జిల్లాలో వరుసగా నకిలీ, కాలం చెల్లిన ఎరువులు పట్టుబడుతున్నా.. వ్యవసాయ అధికారుల్లో పెద్దగా చలనం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆయా ఫర్టిలైజర్ దుకాణా యజమానులు ఇచ్చే మామూళ్లకు ఆశపడి క్షేత్రస్థాయిలో తనిఖీలు మరిచారనే టాక్ వస్తోంది. ఇప్పటికై నా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అన్ని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో తనిఖీలు చేయాలని రైతులు కోరుతున్నారు. నాసిరకం బెడద నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.
రైతులు ఏం చేయాలంటే..
వ్యవసాయశాఖ లైసెన్సు పొందిన డీలర్ వద్దనే విత్తనాలు, పెస్టిసైడ్స్, ఎరువులు కొనాలి. సరిగ్గా సీల్ వేసి ఉన్న ప్యాకెట్లు, బస్తాలను ధ్రువీకరణ పత్రం (ట్యాగ్) ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి. బస్తా, ప్యాకెట్పై గడువు తేదీ, రకం పేరు, లాట్ నంబర్లను గమనించాలి. కొనుగోలు బిల్లుతోపాటు నంబరు, విత్తన రకం, గడువు తేదీ పేర్కొనేలా డీలరు సంతకంతోపాటు రైతు సంతకం బిల్లుపై ఉండేలా చూసుకోవాలి. పంటల అధిక దిగుబడికి నాణ్యమైన ఎరువులనే వాడాలి. మిషన్ కుట్టు ఉన్న ఎరువుల బస్తాను మాత్రమే కొనాలి. బస్తాపై ప్రమాణిక పోషకాలు, ఉత్పత్తిదారుల వివరాలు ఉండాలి. చిరిగిన, రంధ్రాలున్న బస్తాలను తిరస్కరించాలి. ఖాళీ సంచులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపర్చాలి. కొనుగోలు చేసిన ఎరువుల విషయంలో అనుమానం వస్తే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారమివ్వాలి.
అవగాహన అవసరం
చీడపీడల నివారణకు వాడే క్రిమిసంహారక మందుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మందుల విషపూరిత స్థాయిని తెలిపేందుకు డైమండ్ ఆకారంలో తెలుపు రంగు వినియోగిస్తారు. వాటి వర్గీకరణను బట్టి విష స్థాయిని అంచనా వేసుకో వచ్చు. ఎరుపు రంగు ఉంటే అత్యంత విష పూరితం. పసుపు రంగు అతి విష పూరితం. నీలి రంగు విష పూరితం, ఆకు పచ్చరంగు స్వల్ప విష పూరితం అని అర్థం చేసుకోవాలి. వాడిన మందు సీసా, డబ్బా, ప్యాకెట్లను ధ్వంసం చేసి పాతిపెట్టాలి. మందులు కలిపిన పాత్రలను ఇతర అవసరాలకు వాడకూడదు. విచక్షణ రహితంగా పురుగు మందులను వాడడం మంచిదికాదు.
రైతులను భయపెడుతున్న ‘నకిలీ పెస్టిసైడ్స్’
జిల్లాలో జోరుగా వర్షాలు..
ఎరువుల వైపు అన్నదాతల చూపు
ఇటీవల టాస్క్ఫోర్స్ దాడుల్లో
కాలం చెల్లిన పురుగుమందులు
చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్న
వ్యవసాయ శాఖ అధికారులు
ఇటీవలి ఘటనలు..
జూన్ 26న నల్లబెల్లి మండలం రేలకుంటలోని ఓ పెస్టిసైడ్స్ దుకాణంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేసి కాలం చెల్లిన రూ.14.93 లక్షల విలువైన ఎరువులు, పురుగు మందులు పట్టుకున్నారు.
జూన్ 27న దుగ్గొండి మండల కేంద్రంలోని ఓ పెస్టిసైడ్ దుకాణంలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి రూ.51,488 విలువైన నకిలీ ఫె ర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ను స్వాధీనం చేసుకున్నా రు. మరో రెండు దుకాణాల్లో కాలం చెల్లిన రూ.48,600, రూ.25,270 విలువైన పెస్టిసైడ్స్ను పట్టుకున్నారు. అలాగే నర్సంపేట మండలం చంద్రయ్యపల్లిలో రూ.58వేల విలు వైన నకిలీ ఎరువులను పట్టుకున్నారు.
జూన్ 30న వరంగల్లోని అబ్బనికుంట ప్రాంతంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి రూ.38,267 విలువైన నకిలీ పెస్టిసైడ్స్, పురుగు మందులు పట్టుకున్నారు.

‘నాసిరకం’ పరేషాన్!