ఆర్టీసీలో.. ఆ ముగ్గురు: ముఖ్యమంత్రి పేషీకి చేరిన ఫిర్యాదులు
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ ఆర్టీసీ రీజియన్లో ముగ్గురు అధికారులపై సీఎం పేషీకి వెళ్లిన ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి సంస్థ పురోగతికి కృషి చేస్తుండగా.. కొందరు అధికారుల తీరు వివాదాస్పదమవుతోంది. అధికారిక వాహనాలను తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకుంటూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు కొందరు అధికారులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్తూ.. వాహనాలకు టోల్గేట్ల వద్ద చెల్లించిన పన్నుల రశీదులు వైరల్ అవుతున్నాయి. సీఎం పేషీలో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆర్టీసీ విజిలెన్స్, ఇంటెలిజెన్స్లు వేర్వేరుగా విచారణ జరుపుతుండడం చర్చనీయాంశంగా మారింది.
రంగంలోకి నిఘా విభాగాలు..
సీఎం పేషీకి చేరిన ఫిర్యాదుపై విచారణకు నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి. ఓవైపు ఆర్టీసీ విజిలెన్స్, మరోవైపు ఇంటెలిజెన్స్లు ఆరా తీస్తున్నాయి. కొందరు అధికారులు అద్దె బస్సుల నిర్వాహకుల నుంచి ఒక్కో బస్సుకు నెలకు రూ.వేయి చొప్పున వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై విచా రిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు ఆర్టీసీ అధికారులు ఢిల్లీ నుంచి పరిచయమున్న ఓ వ్యక్తితో ఇలా చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలపైనా విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా ఉద్యోగులు, సిబ్బంది, అద్దెబస్సుల నిర్వాహకుల పట్ల నిబంధనల ప్రకారం నిక్కచ్ఛిగా వ్యవహరించడం మూలంగా సదరు అధికారులపై కొందరు సీఎం పేషీలో ఫిర్యాదు చేశారన్న మరో వాదన వినిపిస్తోంది.
బదిలీల కోసం పైరవీలు..
► ఉమ్మడి వరంగల్లోని హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో పనిచేస్తున్న కొందరిపై ఫిర్యాదు చేశారు.
► బదిలీ స్థానాల్లో పని చేయకుండా తాము కోరుకున్న చోటకు వెళ్లేందుకు హైదరాబాద్కు అధికారిక వాహనాల్లో వెళ్లి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
► వరంగల్, హైదరాబాద్లకు తిరుగుతున్నట్లు చెబుతున్నారు.
► ఓ డిపో మేనేజర్ పదోన్నతికి ముందు మెకానికల్ ఫోర్మెన్ (ఎంఎఫ్)గా పనిచేసిన జిల్లాకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారని, ఇదే సమయంలో ఆ జిల్లాకు చెందిన ఓ మంత్రికి బంధువునని చెప్పి కిందిస్థాయి సిబ్బందిని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
► డిప్యూటీ ఆర్ఎంగా ఉన్న ఓ అధికారి కూడా అధికారిక వాహనాన్ని దుర్వినియోగం చేస్తూ నిత్యం హైదరాబాద్కు వెళ్లి వస్తున్నారని ఆరోపించారు.
► అద్దెబస్సుల నిర్వాహకుల నుంచి ఒక్కో బస్సుకు నెలకు రూ.వెయ్యి వసూలు చేస్తున్నారని తెలిసింది.