ఆరిపోయిన ఆశల దీపాలు
గాజువాక/కూర్మన్నపాలెం: దీపావళి రోజున విషాదం చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి పాత గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ఉపాధి కోసం వలస వచ్చిన రెండు నిరుపేద కుటుంబాల ఆశలను ఛిద్రం చేసింది. వారి ఇళ్లలో చీకట్లను నింపింది. కుటుంబానికి ఆసరా అవుతారనుకున్న కుమారులు.. వారిని శోకసంద్రంలో ముంచి.. అనంత వాయువుల్లో కలిసిపోయారు. ఇదే ఘటనలో మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివి..
కూర్మన్నపాలెం ప్రాంతంలో నివాసం ఉంటున్న మారేడుపల్లి అజయ్ కుమార్ (18), వెందుర్తి మనోజ్ కుమార్ (17), కె.మధు(17) ముగ్గురూ స్నేహితులు. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై నగరంలోని ఆర్కే బీచ్కు వెళ్లేందుకు బయలుదేరారు. అజయ్ బైక్ నడుపుతుండగా, మనోజ్, మధు వెనుక కూర్చున్నారు. సరిగ్గా పాతగాజువాక జంక్షన్కు వచ్చేసరికి వారు ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ముగ్గురూ తుళ్లిపోయి రోడ్డుపై పడిపోయారు. ఇది గమనించిన సమీపంలోని ఆటో డ్రైవర్లు వెంటనే స్పందించి, వారిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అజయ్ కుమార్, మనోజ్ కుమార్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన మధును మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించిన గాజువాక ట్రాఫిక్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆరిపోయిన ఆశల దీపాలు
ఆరిపోయిన ఆశల దీపాలు


