
కూటమి నీ(చ)టి రాజకీయం
విశాఖ విద్య: కూటమి నేతల కుళ్లు రాజకీయాలకు ప్రజలు బలైపోతున్నారు. ప్రజలు దాహంతో అల్లాడుతున్నా.. పెత్తనం కోసం ఆరాటపడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. వార్డులో ప్రజల మద్దతుతో గెలిచిన కార్పొరేటర్ను కాదని.. జీవీఎంసీ నిధులతో చేపట్టే పనులకు కూటమి పార్టీలకు చెందిన చోటామోటా నాయకులే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తమను కాదని.. ముందుకు వెళ్లడానికి వీల్లేదని అధికారులకు సైతం హుకుం జారీ చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 52వ వార్డు గౌరీనగర్ (రిక్షా కాలనీ)లో మంగళవారం చోటుచేసుకున్న పరిణామాలు పచ్చ నేతల ఆగడాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి.
బోరు పనులకు అడ్డుకట్ట
జీవీఎంసీ 52వ వార్డు పరిధి రిక్షా కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ ప్రత్యేక చొరవ తీసుకొని బోరువెల్ నిర్మాణానికి జీవీఎంసీ ద్వారా నిధులు మంజూరు చేయించారు. రిక్షా కాలనీలో సుమారు 120 గడపలు ఉండగా, ఇక్కడ 500 మందికి పైగా నివసిస్తున్నారు. వీరంతా రోజువారీ కూలి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సరిపడా తాగునీరు లేక, సమీపంలో ఉన్న రైలు పట్టాలు దాటుకొని.. అవతలి కాలనీలకు వెళ్లి ప్రతిరోజూ నీళ్లు తెచ్చుకుంటున్నారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను తొలగించేలా మూడు బ్లాక్లకు మూడు బోర్లు వేసేలా జియ్యాని శ్రీధర్ నిధులు మంజూరు చేయించారు. సోమవారం ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఒక బ్లాక్లో బోరువెల్ వేశారు. మంగళవారం మిగతా రెండు బ్లాక్ల్లో బోరువెల్ నిర్మాణం పూర్తవుతుందని అంతా సంబరపడ్డారు. కానీ తమ ప్రమేయం లేకుండా పనులు జరిగిపోతున్నాయనే అక్కసుతో కూ టమి వార్డు నాయకుడొకరు వాటర్వర్క్స్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి, పనులు నిలిపి వేయించారు.
పెల్లుబికిన నిరసన
బోరువెల్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిపివేయడంపై రిక్షా కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపులు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ డ్రిల్లింగ్కు అంతా సిద్ధం చేసినా, పనులు జరగకుండా కూటమి నాయకులు అడ్డుపడుతున్నారని తెలుసుకున్న కాలనీ వాసులు నిరసనకు దిగారు. ఖాళీ బిందెలతో వాహనానికి అడ్డంగా, రోడ్డుపైనే ఆందోళన చేపట్టారు. మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ కాలనీలో జరిగిన పరిణామాలపై జీవీఎంసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించేందుకు ఏ ఒక్క అధికారి కూడా అక్కడికి రాకపోవడంతో కాలనీ వాసులంతా రాత్రి వరకు రోడ్డుపైనే ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ‘మాకు బోరు వేయాలి.. తాగునీళ్లు ఇప్పించాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అధికారుల మౌనం ఎందుకో?
రిక్షా కాలనీలో బోర్వెల్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని తెలిసినా, జీవీఎంసీ వాటర్వర్క్స్ విభాగం అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. జీవీఎంసీ నిధులతో, పద్ధతి ప్రకారం టెండర్ ద్వారా కాంట్రాక్టర్కు పనులు అప్పగించినప్పుడు, వీటిని దగ్గరుండి పూర్తి చేయాల్సిన అధికారులు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వాటర్ వర్క్స్ విభాగం ఏఈ సుమన్ను ‘సాక్షి’ వివరణ కోరేందుకు పలుమార్లు ప్రయత్నించినా, ఆయన ఫోన్కు స్పందించలేదు.
ప్రజలతో ఆటలాడుకోవడం సరికాదు
రిక్షాకాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి జీవీఎంసీ ద్వారా నిధులు మంజూరు చేయించాం. స్థానిక కార్పొరేటర్గా ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇలాంటి విషయాల్లో కూడా రాజకీయాలు చేయడం సరైంది కాదు. ప్రజలతో ఆటలాడుకోవడం మంచి పద్ధతి కాదు. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకుని, బోర్ వెల్ నిర్మాణం పూర్తి చేయాలి. రిక్షా కాలనీ వాసులకు తాగునీటిని అందించాలి.
– జియ్యాని శ్రీధర్, మాజీ డిప్యూటీ మేయర్
రిక్షా కాలనీలో బోర్ పనులకు బ్రేక్
పచ్చ నేతల తీరుపై ప్రజల ఆగ్రహం
ఖాళీ బిందెలతో కాలనీలో నిరసన

కూటమి నీ(చ)టి రాజకీయం