
వికారాబాద్లో జెడ్పీ కార్యాలయం
2019తో పోలిస్తే ఆరు పెరిగి 227కు చేరిన ఎంపీటీసీ స్థానాలు
18 నుంచి 20కి చేరిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు
మొత్తం ఓటర్లు 6,99,894 మంది
పోలింగ్ స్టేషన్లు 1,288
పోటీకి సిద్ధమవుతున్న ఆశావహులు
వికారాబాద్: త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. బుధవారం మండలాల వారీగా ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలను కూడా ప్రకటించింది. స్థానిక సంస్థల్లో ముందుగా గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగిసింది. ప్రభుత్వం జీపీ ఎన్నికలకు బదులుగా మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తయిన నేపథ్యంలో పార్టీ గుర్తుతో నిర్వహించే ఎన్నికలకే వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ఎన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు ఉండాలనే దానిపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా దాన్ని ఆమోదించింది. కొత్తగా ఏర్పాటైన మండలాలు, పక్క మండలాల నుంచి కలిసిన గ్రామాలు, మండ లాల నుంచి మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామా లను పరిగణలోకి తీసుకుని మండలాల వారీగా ఎంపీటీసీల సంఖ్యను నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటైన మండలాల్లో సైతం ఎంత మంది ఎంపీటీసీలు ఉండలానేది నిర్ణయించారు. ఒక్కో ఎంపీటీసీ పరిధిలో సగటున 3,083 మంది ఓటర్లు రాగా.. ఒక్కో జెడ్పీటీసీ పరిధిలో 34,997 మంది ఓటర్లు రానున్నారు.
ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు
జిల్లాలో మొత్తం 221 ఎంపీటీసీ, జెడ్పీటీసీలు 18 స్థానాలు ఉన్నాయి. గత ఏడాది జూలైలో ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం ముగిసింది. ఒక్కరోజు తేడాతో జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం పూర్తయ్యింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో పాలన సాగుతోంది. గతంలో ప్రభుత్వం జీపీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించింది. ఓటరు జాబితా, బీసీ కమిషన్ నివేదికతో సన్నద్ధంగా ఉండాలని సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టి పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించింది. అతి త్వరలో వరుస ఎన్నికలు రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పెరిగిన స్థానాలు
2019లో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం వీటి సంఖ్య పెరిగింది. అప్పట్లో 18 మండల పరిషత్ల పరిధిలోని 221 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కొత్తగా చౌడాపూర్, దుద్యాల్ మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో వీటి పరిధిలో ఆరు కొత్త ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో వీటి సంఖ్య 227కు చేరింది. అత్యల్పంగా బంట్వారం మండలంలో 6 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, మర్పల్లి, తాండూరు మండలాల్లో 15 చొప్పున ఉన్నాయి. జిల్లాలో 3,44,963 మంది పురుషు ఓటర్లు ఉండగా, 3,54,912 మంది మహిళా ఓటర్లు, 19 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. 20 మండలాల పరిధిలో 1,288 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయా లని నిర్ణయించారు. ఒక్కో బూత్ పరిధిలో 400 నుంచి 750 మంది ఓటర్ల వరకు ఉన్నారు.
మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలు, ఓటర్ల సంఖ్య
మండలం 2019లో 2025లో ఓటరు
బంట్వారం 06 06 17,690
బషీరాబాద్ 12 12 41,178
బొంరాస్పేట్ 15 11 32,086
చౌడాపూర్ 00 09 25,176
ధారూరు 12 12 36,304
దోమ 14 14 44,359
దౌల్తాబాద్ 15 14 41,758
దుద్యాల్ 00 08 20,967
కొడంగల్ 11 11 32,144
కోట్పల్లి 07 07 21,361
కుల్కచర్ల 16 12 38,413
మర్పల్లి 15 15 45,455
మోమిన్పేట్ 12 12 39,788
నవాబుపేట్ 12 12 37,917
పరిగి 13 11 31,202
పెద్దేముల్ 13 13 40,820
పూడూరు 13 13 43,419
తాండూరు 15 15 47,107
వికారాబాద్ 07 07 24,250
యాలాల 13 13 38,500