ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబినేషన్లో సినిమా ?
ప్రస్తుతం మూడు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ప్రభాస్
‘సాహో’ తర్వాత యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ మూడు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు త్వరలో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేజీఎఫ్ సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న ప్రశాంత్, తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి ఓ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. దీంతో ప్రశాంత్ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్తో వేగంగా ఒక ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. దీనికి సంబంధించి ప్రభాస్, ప్రశాంత్ ఇటీవల కలుసుకున్నారని కూడా గుసగుసలు విన్పిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
బిజీ బిజీగా ప్రభాస్ :
ప్రస్తుతం ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఫామ్ రీడర్గా, పూజా హెగ్డే సంగీత ఉపాధ్యాయురాలిగా కనిపిస్తారు. వీరి కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. ఈ సంవత్సరం జనవరిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్ళగా, డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్టును ముగించి వచ్చే ఏడాది ఆరంభం నుంచి నాగ్ అశ్విన్ తీస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రంలో పాల్గొనాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ఈ సినిమాతో దీపికా పదుకొనే టాలీవుడ్లో అరంగేట్రం చేస్తోంది. ఇదేకాక దర్శకుడు ఓం రౌత్ భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’లోనూ నటించబోతున్నాడు. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు