ప్రత్యేక ప్రతిభావంతుల్లో మనోధైర్యాన్ని నింపాలి
చంద్రగిరి: ప్రత్యేక ప్రతిభావంతులను జాలి, దయతో ఆదరించడంతో పాటు వారిలో మనోధైర్యాన్ని నింపాలని జిల్లా సహిత విద్య సమన్వయకర్త చంద్రశేఖర్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలోని భవితా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను, పథకాలను సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ–2 భాస్కర్ బాబు, బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం వెంకటరమణ రెడ్డి, ఐఈఆర్టీఎస్ వెంకటరాజేశ్వరి, శ్యామలదేవి, ఐఈడీఎస్ఎస్ ఉదయ్కుమార్, జయలక్ష్మి పాల్గొన్నారు.


