విద్యార్థులకు బ్రిడ్జ్‌ కోర్సు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు బ్రిడ్జ్‌ కోర్సు ప్రారంభం

Jul 10 2025 8:16 AM | Updated on Jul 10 2025 8:24 AM

తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో పలు పీజీ కోర్సుల్లో నూతనంగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వారం రోజుల పాటు నిర్వహించనున్న బ్రిడ్జ్‌ కోర్సును బుధవారం ప్రారంభించారు. వర్సిటీలోని చెలికాని అన్నారావు భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అకడమిక్‌ డీన్‌ ప్రొఫెసర్‌ రజనీకాంత్‌ శుక్లా, స్కూల్‌ ఆఫ్‌ దర్శన్‌ డీన్‌ ప్రొఫెసర్‌ విష్ణుభట్టాచార్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతనంగా పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సంస్కృత భాషతోపాటు అందులో శాసీ్త్రయ అంశాలు, శాస్త్రాల సమగ్ర జ్ఞానాన్ని బ్రిడ్జ్‌ కోర్సులో అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ పంకజ్‌ కుమార్‌ వ్యాస్‌, సహాయక ఆచార్యులు డాక్టర్‌ యశస్వి, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆశా కార్యకర్తల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి తుడా:ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు తిరు పతి జిల్లాలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పథకం కింద పలు పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ పరిధిలో 27 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్న ట్లు జిల్లా వైద్య శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. వయస్సు 25 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న మహిళా అభ్యర్థులు ఈనెల 16లోపు తమ పరిధిలోని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల మెడికల్‌ ఆఫీసర్లకు దరఖాస్తులను అందజేయాలని కోరారు.

ఆల్‌ ఇండియా వీసీ కాన్ఫరెన్స్‌లో ఎన్‌ఎస్‌యూ వీసీ

తిరుపతి సిటీ : కర్ణాటకలోని ముద్దెనహలి, సత్యగ్రామ, సత్యసాయి ప్రేమామృతం వేదికగా జరిగిన ఆల్‌ ఇండియా వైస్‌ ఛాన్సలర్స్‌ కాన్ఫరెన్స్‌లో జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి పాల్గొన్నారు. భారత్‌ విశ్వగురువుగా వెలుగొందేందుకు తీసుకోవాల్సిన నూతన సంస్కరణలు, రీసెర్చ్‌ ఇన్నోవేషన్స్‌ ప్రోత్సహించడం, వర్సిటీల బలోపేతం తదితర అంశాలపై ఈ కాన్ఫరెన్స్‌లో విస్తృతంగా చర్చించారు.

అత్తపై హత్యాయత్నం కేసులో అల్లుడి అరెస్టు

నాయుడుపేటటౌన్‌ : అత్తపై హత్యాయత్నం చేసిన కేసులో అల్లుడు రవీంద్రనాథ్‌ను బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ ఆదిలక్ష్మి తెలిపారు. పట్టణంలోని అగ్రహారపేట అరుందతీ కాలనీలో నివాసం ఉంటున్న అత్త మహేశ్వరి ఇంటి వద్దకు బాలయపల్లి మండలం హస్తకావేరి గ్రామానికి చెందిన అల్లుడైన రవీంద్రనాథ్‌ వచ్చి ఈనెల 2వ తేదీ రాత్రి కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లుడు రవీంద్రనాథ్‌ వివాహేతర సంబంధం పెట్టుకుని ఉన్నాడని అత్త నిలదీయడంతో కోపంతో అత్తపై దాడి చేసి హత్యాయత్నం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితుడిని పట్టుకుని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

రెండిళ్లల్లో చోరీ

– 17 సవర్ల బంగారం అపహరణ

శ్రీకాళహస్తి : రెండు పక్క పక్క ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడిన ఘటన రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సాలిపేటలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని సాలిపేటలో మంగళవారం అర్ధరాత్రి ఎవరూ లేనిది గుర్తించి మునిరాజ ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రెండు సవర్ల బంగారు, ఇంటి పత్రాలు, పిల్లలు చదువుకునే సర్టిఫికెట్లను దోచుకెళ్లారు. అదే విధంగా పక్కనే ఉన్న వీరస్వామి ఇంట్లో బీరువాలో ఉన్న 15 సవర్ల బంగారు, రూ.70 వేల నగదు, 150 గ్రాముల వెండి, విలువైన డాక్యుమెంట్లు చోరీకి గురైనట్లు తెలిపారు. రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి క్లూస్‌టీంతో పరిసరాల్లో సీసీ కెమెరాల ఫుటేజీ, వేలిముద్రలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని రెండో పట్టణ సీఐ నాగార్జునరెడ్డి తెలిపారు. సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు చోరీకి గురి కావడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది.

విద్యార్థులకు బ్రిడ్జ్‌ కోర్సు ప్రారంభం 1
1/2

విద్యార్థులకు బ్రిడ్జ్‌ కోర్సు ప్రారంభం

విద్యార్థులకు బ్రిడ్జ్‌ కోర్సు ప్రారంభం 2
2/2

విద్యార్థులకు బ్రిడ్జ్‌ కోర్సు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement