ఇల్లు అలకగానే పండుగ కాదు
● చంద్రబాబునాయుడు ఊహల్లో తేలుతున్నారు ● ప్రజల కష్టాలు తెలిసిన ఏకై క నాయకుడు జగన్ ● మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు కలెక్టరేట్ : ఇల్లు అలకగానే పండుగ కాదు అనే సామెత ఉంది.. పొరబాటున రెండు, మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలవగానే అధికారంలోకి వచ్చేసినట్లు చంద్రబాబు కలలు కంటున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఊహల్లో తేలుతున్నారని చెప్పారు. నవంబర్లో ఎన్నికలు వస్తాయనుకుంటున్న బాబు ఊహలు సాధ్యమయ్యే పనికాదన్నారు. ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉంటాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ బలాన్ని ప్రదర్శించుకోవచ్చన్నారు. వైఎస్సార్సీపీ రాబోయే ఎన్నికలపై ధీమాగా ఉన్నట్లు తెలిపారు. తమ పార్టీకి 150 కంటే ఎక్కువ స్థానాలు వస్తాయన్నది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పుట్టుకతోనే భయంలేదని చెప్పారు. పచ్చపార్టీ, ఎల్లో మీడియా చేస్తున్న పుకార్లలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాల్లో ఇంతవరకు ఏ నాయకుడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకోలేదన్నారు. ప్రజా సంకల్పయాత్రలో 3,648 కిలోమీటర్ల దూరం నడచి కోట్లాది మంది ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్న ఏకై క నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరే అన్న విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాలని మంత్రి పేర్కొన్నారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.