గరుడ వాహనంపై కోదండరాముడి అభయం
తిరుపతి కల్చరల్: శ్రీకోదండరామస్వామి వారివార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం రాత్రి స్వామివారు గరుడ వాహనధారుడై ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. భజనలు, మంగళవాయిద్యాల నడుమ, భక్తుల రామనామస్మరణతో జగదభిరాముడి గరుడ సేవ కోలాహలంగా సాగింది. ఉదయం స్వామివారి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోహినీ అవతారధారుడైన శ్రీరామచంద్రుడు పల్లకీలో కొలువై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. వాహన సేవ అనంతరం స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. గరుడ వాహనసేవలో చిన్న జీయర్ స్వామి, టీటీడీ జేఈఓ బీరబ్రహ్మం దంపతులు, కంకణభట్టర్ ఆనందకుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, చలపతి తదితరులు పాల్గొన్నారు. పెద్ద జీయర్స్వామి, ఆలయ డెప్యూటీ ఈఓ నాగరత్నం, ఏఈఓ మోహన్, సూపరింటెండెంట్ రమేష్ పాల్గొన్నారు.