హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి అలిపిరి: కేంద్ర, రాష్ట్ర టూరిజం శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యుట్రిషియన్, తిరుపతి కళాశాలలో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టూరిజం ఆర్డీ ప్రిన్సిపల్ రమణప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 27 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎస్ఐహెచ్ఎం కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్సీహెచ్ఎం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ – 2023 మే 14న ఉంటుందని, అర్హత సాధించిన వారు మూడేళ్లు బీఎస్సీ డిగ్రీ కోర్సులో చేరవచ్చన్నారు. పెద్దపెద్ద హోటల్స్లో ఇంటర్న్షిప్ పొందవచ్చని, ఆ సమయంలో ఉచిత వసతి, భోజనంతోపాటు స్కాలర్షిప్ మంజూరు చేయనున్నట్టు వెల్లడించారు. మూడేళ్ల బీఎస్సీ కోర్సుతో పాటు, ఒకటిన్నర సంవత్సరం క్రాఫ్ట్ కోర్సు ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఉంటుందన్నారు. పది, ఇంటర్ పాస్ అయినవారు, డిగ్రీ ఫెయిల్ అయిన 25 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 28 ఏళ్లు వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఇతర వివరాలకు అడ్మిషన్ కో–ఆర్డినేటర్ శివరామకృష్ణ 9700440604, 9100558006, 9701343846 సంప్రదించవచ్చన్నారు.