వీఆర్వో కనిపించడంలేదంటూ పోస్టర్లు
వెంకటగిరిరూరల్ (బాలాయపల్లి): బాలాయపల్లి మండలం, జయంపు గ్రామ సచివాలయ ఇన్చార్జి వీఆర్వో కృష్ణయ్య కనిపించడం లేదంటూ స్థానికులు పోస్టర్లు అంటించడం కలకలం రేపింది. ఆయన అందుబాటులో లేకపోవడంతో ప్రజలకు విసుగెత్తి ఇలా పోస్టర్లు వేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం జయంపు సచివాలయ వీఆర్వో కనిపించడంలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆపై సచివాలయానికి పోస్టర్లు అంటించి వెళ్లిపోయారు.
వేధిస్తున్న వీఆర్వోల కొరత
బాలాయపల్లి మండలం పరిఽధిలో 51 రెవెన్యూ గ్రామాలు ఉండగా అందులో 15 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయానికి ఒక వీఆర్వో ఉండాల్సి ఉంది. కానీ స్థానికంగా ఏడుగురు మాత్రమే వీఆర్వోలు ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
రెండు రోజుల్లో రెగ్యులర్ వీఆర్వోను నియమిస్తాం
బాలాయపల్లి మండల పరిధిలో వీఆర్వోల కొరత ఉంది. దీంతో కొన్ని సచివాలయాలకు ఇన్చార్జి వీఆర్వోలను నియమించాం. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. జయంపు సచివాలయానికి మరో రెండు రోజుల్లో రెగ్యులర్ వీఆర్వోను నియమిస్తాం.
– శ్రీనివాసులు, తహసీల్దార్, బాలాయపల్లి