వైషమ్యాలకు దారితీసింది!

కర్మాగారం వద్ద ఆందోళన చేస్తున్న స్థానికులు - Sakshi

● రాచగున్నేరి–చిందేపల్లె రోడ్డును ఆర్‌అండ్‌బీ రోడ్డుగా మార్చుతూ గతంలో జీఓ ● ఈ మార్గంలో గోడకట్టిన శ్రీకాళహస్తి పైప్స్‌ ● ఉపయోగపడని ప్రత్యామ్నాయ రోడ్డు ● పాత రోడ్డే కావాలంటూ గ్రామస్తుల ఆందోళన ● ప్రాణత్యాగానికై నా సిద్ధమంటున్న స్థానికులు

సాక్షి, తిరుపతి: పచ్చని పల్లెను ఫ్యాక్టరీ దత్తత తీసుకుంది. గ్రామాభివృద్ధికి చేదోడువాదోడుగా నిలించింది. మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. దశాబ్దాలుగా అన్యోన్యంగా సాగిన ఈ బంధం తాజాగా శ్రీరహదారిశ్రీ చిచ్చు వైషమ్యాలకు దారితీసింది. గ్రామస్తులు రాకపోకలు సాగించే మార్గానికి అడ్డంగా ఫ్యాక్టరీ యాజమాన్యం గోడ కట్టేసింది. గ్రామీణ రోడ్డును ఆర్‌ంఅడ్‌బీ రోడ్డుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ జారీచేసిన జీవో చిచ్చు రాజేసింది. ఏర్పేడు మండలం, చిందేపల్లివాసులు దారి కోసం శ్రీకాళహస్తి పైప్స్‌ కర్మాగారంతో చేస్తున్న పోరు తుది అంకానికి చేరింది.

ఏర్పేడు మండలం, చిందేపల్లివాసులు ఏర్పేడుకు వెళ్లేందుకు వెంకటగిరి మార్గం, శ్రీకాళహస్తికి వెళ్లేందుకు శ్రీకాళహస్తి పైప్స్‌ కర్మాగారం మార్గంలో రాకపోకలను సాగిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ మార్గంగుండా రాకపోకలను సాగిస్తున్నారు. సుమారు 6 కిలోమీటర్లు దూరం ఉన్న ఈ మార్గం గ్రామీణ రోడ్డు కావడంతో పంచాయతీ ఆధీనంలో ఉండేది. అయితే 1992లో ఇక్కడ ఈ మార్గానికి ఆనుకుని రోడ్డుకు ఇరువైపులా ల్యాంకో కర్మాగారం ఏర్పాటైంది. గ్రామాన్ని కూడా దత్తత తీసుకుని కొంతమేరకు అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం అయింది. అయితే కాలుష్యం, రసాయన వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ వదిలేయడంతో భూగర్భజలాలు కలుషితమయ్యాయి. తాగునీటి సమస్య ఏర్పడింది.

ఆ జీవో రాజేసింది

జీఓ నం.22 ద్వారా 2016లో రాష్ట్ర వ్యాప్తంగా 61 గ్రామీణ రోడ్లను ఆర్‌అండ్‌బీ పరిధిలోకి మార్చుతూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈనేపథ్యంలోనే రాచగున్నేరి–చిందేపల్లి రోడ్డు కూడా ఆర్‌అండ్‌బీ రోడ్డు పరిధిలోకి వచ్చింది. ఫ్యాక్టరీ మధ్యలో ఉన్న ఈ రోడ్డుపై పంచాయతీ ఆజమాయిషీ కోల్పోయి ఆర్‌అండ్‌బీ రోడ్డుగా రూపాంతరం కావడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం గత పాలకుల కనుసన్నల్లో రోడ్డును కలుపుకోవాలని పన్నాగం రచించింది. ఫ్యాక్టరీ ప్రాంగణంలోని రహదారిలో గ్రామస్తులు రాకపోకలు సాగించడం వల్ల అటువైపుగా వెళ్లే తమ వాహనాలకు ఇబ్బంది ఏర్పడుతుందని, ఈ రోడ్డును తమ ఆధీనంలోకి ఇవ్వాలని దరఖాస్తులు పెట్టింది. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ పైభాగంలో ప్రత్యామ్నాయ రోడ్డు వేశారు. ఈ మార్గం తమకు అనుకూలంగా లేదని, రెండు కిలోమీటర్లు చుట్టు పెరుగుతోందని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ వివాదం నడుస్తున్న తరుణంలోనే ఈనెల 18వ తేదీన అర్ధరాత్రి ఫ్యాక్టరీ యాజమాన్యం పోలీసు బలగాల సాయంతో రోడ్డుకు అడ్డంగా రాకపోకలు లేకుండా గోడ కట్టింది. విషయం తెలుసుకుని వెళ్లి అడ్డుకున్న స్థానికులపై కేసులు బనాయించారు.

బీజేపీ మద్దతుతో ఆందోళన

పాతరోడ్డునే పునరుద్ధరించాలని డిమాండ్‌చేస్తూ గురువారం శ్రీకాళహస్తి పైప్స్‌ ఫ్యాక్టరీ ఎదుట బీజేపీ నేతలు స్థానికులతో కలిసి ఆందోళన చేశారు. 2016లో టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక జీఓ నం.22 ద్వారా ఈ రోడ్డును ఆర్‌అండ్‌బీ రోడ్డుగా మార్చడమే స్థానికులకు శాపంగా మారిందని జీఓ కాపీలను బహిర్గతం చేశారు.

పాత రోడ్డే అనుకూలం

మా గ్రామానికి పాత రోడ్డు 80 ఏళ్లుగా ఉంది. కంపెనీ యాజమాన్యం దురుద్దేశంతో రోడ్డును ఆక్రమించుకుని ప్రత్యామ్నాయ మార్గం కల్పిస్థామని చెప్పడం దుర్మార్గం. గ్రామీణ రోడ్డుగా ఉన్నప్పుడు మా రోడ్డు జోలికి రాని ఫ్యాక్టరీ వాళ్లు ఆర్‌అండ్‌బీ రోడ్డుగా మార్చాక ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన జీఓ మాకు రహదారి సమస్యను తెచ్చిపెట్టింది. ప్రాణత్యాగాలకైనా సిద్ధమే కానీ పాత రోడ్డును వదులుకోం.

– వెంకటసుబ్బయ్య, గ్రామస్తుడు, చిందేపల్లి, ఏర్పేడు మండలం

ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు

గ్రామస్తులు, పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి వివాదాన్ని పరిష్కరించేందుకు ఇద్దరు తహసీల్దార్లను నియమించాం. వారు గ్రామస్తులతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటుచేశాం.

– రామారావు, ఆర్డీఓ, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్‌

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top