ద్విచక్రవాహనాల దొంగలకు రిమాండ్‌

- - Sakshi

పిచ్చాటూరు: ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి సత్యవేడు కోర్టు 15 రోజులు రిమాండ్‌ విధించినట్లు నాగలాపురం ఎస్‌ఐ హనుమంతప్ప తెలిపారు. గురువారం ఉదయం నాగలాపురం పోలీస్‌ స్టేషన్‌లో పుత్తూరు డీఎస్‌పీ రామరాజు, సత్యవేడు సీఐ శివకుమార్‌ రెడ్డి సమక్షంలో నలుగురు నిందితులతో పాటు వారు దొంగిలించిన 11 ద్విచక్ర వాహనాలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్‌పీ మాట్లాడుతూ ఎ.అజయ్‌(28), వినోద్‌కుమార్‌(20), బి.విష్ణు(19), ప్రతాప్‌(32) నాగలాపురం తూర్పు ఆర్చి వద్ద బైక్‌పై నాగలాపురం వైపు వస్తుండగా అక్కడ ఉన్న పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారన్నారు. నలుగురుని ఎస్‌ఐ, సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని విచారించారు. నాగలాపురం మండలంలో 5, పిచ్చాటూరు మండలంలో 4, శ్రీసిటీ, విజయపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 11 వాహనాలు దొంగిలించినట్లు అంగీకరించారని తెలిపారు. వాటి విలువ రూ.4.5 లక్షలు ఉంటుందన్నారు. నిందితుల్లో అజయ్‌, వినోద్‌కుమార్‌ విష్ణు నాగలాపురం మండలానికి చెందిన వారు కాగా, ప్రతాప్‌ తమిళనాడులోని పొన్నేరికి చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు. వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితులను సత్యవేడు కోర్టుకు తరలించగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్‌ విధించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కేసును ఛేదించడానికి కృషి చేసిన ఎస్‌ఐ హనుమంతప్ప, ఏఎస్‌ఐ రవి, హెడ్‌ కానిస్టేల్‌ హనీఫ్‌, కానిస్టేబుల్‌ రఘు, కుప్పారావు, గోపి, కేశవ, మారయ్య, అజిత్‌ లకు డీఎస్‌పీ రామరాజు రివార్డులు బహుకరించారు.

Read latest Tirupati News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top