ప్రియుడి కోసం ట్యాంక్ ఎక్కిన యువతి
కొత్తూరు: ప్రియుడి ఆచూకీ తెలపాలంటూ ఓ ప్రియురాలు వాటర్ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండల పరిధిలోని మల్లాపూర్లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా వేంసూర్ మండలానికి చెందిన ఓ యువతి కొన్నేళ్లుగా హైదరాబాద్లో నివసిస్తుంది. స్నేహితులు ద్వారా మల్లాపూర్ గ్రామానికి చెందిన రాఘవేందర్రెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ప్రియుడు మొఖం చాటేశాడు. దీంతో యువతి కొన్ని నెలల కిందట హైదరాబాద్లోని చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రాఘవేందర్రెడ్డిని రిమాండ్కు తరలించారు.
కాగా రాఘవేందర్రెడ్డి బెయిల్పై ఇటీవల బయటకు వచ్చాడు. అప్పటి నుంచి ఆమె ప్రియుడిని కలిసేందుకు యత్నించగా ఆచూకీ లభించలేదు. ఇటీవల ఆమె ప్రియుడి సొంతూరు మల్లాపూర్కు వెళ్లి ఆరాతీసింది. అక్కడా లేకపోవడంతో హైదరాబాద్కు చేరుకుంది. ప్రియుడిని ఎలాగైనా కలవాలని మంగళవారం మళ్లీ మల్లాపూర్కు చేరుకుని గ్రామంలోని వాటర్ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి న్యాయం చేస్తామనడంతో యువతి ట్యాంక్ దిగింది. ఆమెను పోలీసులు కొత్తూరు పీఎస్కు తరలించారు.