TS: నిరసన తెలిపే హక్కు కూడా లేదా?: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరసన తెలిపే అవకాశం కూడా లేకపోవడం దురదృష్టకరమని నల్లగొండ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, విద్యార్థుల ఫీజులు చెల్లించాలని అడిగితే పోలీసులతో దాడులు చేయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఈనెల 2న టీపీసీసీ అధ్వర్యంలో నిర్వహించిన ’విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ ఆందోళన సందర్భంగా పోలీసుల లాఠీచార్జిలో గాయపడ్డ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆమేర్ జావెద్ను బుధవారం ఉత్తమ్ హైదరాబాద్లో పరామర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరంకుశ విధానాలు ప్రజాస్వామ్యంలో మనుగడ సాగించలేవన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ లాఠీలు, తూటాలకు భయపడదని, రాష్ట్రం లోని అన్ని వర్గాలకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతుందని తెలిపారు.