Telangana: కొత్తగా 181 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శుక్రవారం 39,781 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 181 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,79,245కి చేరింది. గత 24 గంటల్లో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,013కు చేరినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
తాజాగా 203 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 6,71,450కి పెరిగింది. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ ఉన్న రిస్క్ దేశాల నుంచి శుక్రవారం 217 మంది ప్రయాణికులు హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. వారికి పరీక్షలు నిర్వహించగా, అందులో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే, అది ఒమిక్రానో కాదో తెలుసుకునేందుకు అధికారులు నమూనాను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.