కరోనాలో కా'మెన్'‌!

Telangana registered 1610 new cases in a single day - Sakshi

రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 65.6% మగవారే 

తాజాగా మరో 1,610 కరోనా కేసులు నమోదు 

రాష్ట్రంలో 57,142కు చేరిన పాజిటివ్‌ కేసుల సంఖ్య 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా బారినపడ్డ వారిలో మగవారే అధికంగా ఉన్నారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 65.6% పురుషులే ఉన్నారు. మిగిలిన 34.4% మహిళలు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన కరోనా బులెటిన్‌లో వెల్లడించింది. ఎన్నడూ లేనట్లుగా 59 పేజీలతో భారీ బులెటిన్‌ను సర్కారు విడుదల చేసింది. అందులో అనేక విషయాలను విశ్లేషించింది. ఇక ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల్లో 46.13 శాతం మంది కరోనా తీవ్రతతో చనిపోగా, 53.87 శాతం మంది కరోనాతో పాటు ఇతరత్రా అనారోగ్య కారణాలు తోడై చనిపోయినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. నమోదైన కేసుల్లో 65.7% 21–50 ఏళ్లలోపు వారే ఉన్నారు. అందులో 21 నుంచి 30 ఏళ్ల వయస్సువారు 22.1 శాతం మంది ఉండగా, 31 నుంచి 40 ఏళ్ల వయస్సువారు అత్యధికంగా 25% ఉన్నారు. 41 నుంచి 50 ఏళ్ల వయస్సువారు 18.6% ఉన్నారు. కరోనా బారినపడ్డ వారిలో 81 ఏళ్ల పైబడిన వయసున్న వారు అత్యంత తక్కువగా 0.6% ఉన్నారు.  

కొత్తగా మరో 1610 కరోనా కేసులు నమోదు 
రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజులోనే 1,610 కేసులు నమోదయ్యాయి. 9 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 57,142కు చేరుకుంది. అందులో 42,909 మంది కోలుకున్నారు. దేశంలో కోలుకున్నవారు 64% ఉండగా, తెలంగాణలో 75.1% ఉందని డాక్టర్‌ శ్రీని వాసరావు తెలిపారు. ప్రస్తుతం 13,753 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో 8,479 మంది హోం లేదా ఇతరత్రా ఐసో లేషన్‌లో ఉన్నారు. లక్షణాలు లేకుండా హోం ఐసోలేషన్‌లో 84 శాతం మంది ఉన్నారని పేర్కొన్నారు. సోమవారం ఒక్కరోజు 15,839 మందికి పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 3,79,081 మందికి పరీక్షలు చేసినట్లయింది.  

ఈ వారంలో జీహెచ్‌ఎంసీలో తగ్గుముఖం... 
ఈ నెల 21న జీహెచ్‌ఎంసీలో నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 703 కాగా, ఆ తర్వాత రోజు 842కు పెరిగాయి. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే 27వ తేదీ నాటికి కేసుల సంఖ్య తగ్గుతూ 531కు చేరుకున్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కొమురంభీం, మహబూబాబాద్, మెదక్, నాగర్‌కర్నూలు, నల్లగొండ, నిర్మల్‌ జిల్లాల్లో ఈ వారం రోజుల్లో కేసులు తగ్గుముఖం పట్టాయి. మిగిలిన జిల్లాల్లో ఒకట్రెండు మినహా అంతటా కేసులు పెరిగాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఈ నెల 21న 34 కేసులు, 27న 152 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఈనెల 21న 117 కేసులు,  27న 172 కేసులు రికార్డు అయ్యాయి. ఇక అన్ని జిల్లాల్లోనూ కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసి కేసుల కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ కృషి చేస్తోందని శ్రీనివాసరావు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top