ఏడేళ్లుగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విఫలం: రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సాహెబ్నగర్ బాధిత కుటుంబాలను తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది వర్షాలు వచ్చి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని, చాలా నష్టం వాటిల్లిందన్నారు. నాలాల పునరుద్ధరణ చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందని మండిపడ్డారు. ఏడేళ్లుగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ విఫలమయ్యారని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యమే ఇలాంటి ఘటనలకు కారణమని రేవంత్రెడ్డి మండిపడ్డారు.
రాష్ట ప్రభుత్వం స్పందించి శివ, అంతయ్య కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంటికి ఒక ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని అన్నారు. రెండు కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ రూ.లక్ష ఆర్థిక సహాయం చేసిందన్నారు. మున్సిపల్ చట్టం ప్రకారం మ్యాన్ హోల్ దిగడానికి వీల్లేదని, చట్టాన్ని ఉల్లంఘించి మ్యాన్ హోల్లో దింపారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం ప్రధాన కారణమని, మ్యాన్ హోల్లో దళితులను రాత్రి పూట దింపడం చట్ట విరుద్ధమని, ఐదు రోజులు గడుస్తున్నా అంతయ్య ఆచూకీ తెలవకపోవడం దారుణమని తెలిపారు.