‘ప్రాణహిత పుష్కరాలకు నిధులు కేటాయించాలి’
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈనెల 13 నుంచి మొదలవనున్న పుష్కరాలకు ప్రభుత్వం ఇంకా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడంపై ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కాళేశ్వరం తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం అత్యంత దారుణమని మండిపడ్డారు. తాగునీరు, వైద్య శిబిరాల వంటి కనీస సౌకర్యాల కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలన్నారు.