అడవిపందిని మట్టికరిపించాడు

Man Fight With Wild Boar In Telangana - Sakshi

వెల్గటూరు (ధర్మపురి): వనం వీడి జనంలోకి వచ్చిన ఓ అడవిపంది దాడిచేయడంతో ప్రాణాలకు తెగించి మట్టికరిపించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మం డలం రాజారాంపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. రాజారాంపల్లి గ్రామంలోని మల్లారెడ్డి పెట్రోల్‌పంపు వెనుక నుంచి ఓ అడవి పంది అకస్మాత్తుగా రాష్ట్ర రహదారిపైకి దూసుకొచ్చింది. అరుస్తూ జనంపై దాడికి యత్నించింది. అనంతరం పరుగులుతీస్తూ ఓ పశువుల దొడ్డిలో చొరబడింది. ఆ దొడ్డిలో పనిచేస్తున్న మాచర్ల చంద్రయ్యపైనా దాడి చేసింది. 

చంద్రయ్య కాలును నోటితో కరుచుకుంది. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించిన చంద్రయ్య పందిపై తిరగబడ్డాడు. కాలును పంది నోట్లో నుంచి విడిపించుకుని, రెండు చేతులతో పందిని గట్టిగా పట్టుకుని పోరాడాడు. చివరికి పందిని అదిమిపట్టి పట్టుకోవడంతో సమీపంలో ఉన్న కొందరు వచ్చి తాళ్లతో బంధించి హతమార్చారు. చంద్రయ్య కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో ధర్మారం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top