అటు రాహుల్..ఇటు నడ్డా..తెలంగాణలో వేసవిని మించిన వేడి..!
ఏడాదిన్నర ముందే ఎన్నికల వేడి నేతల పర్యటనలతో రాష్ట్ర రాజకీయాలకు ఊపు
వ్యూహ, ప్రతి వ్యూహాల్లో పార్టీలు
6, 7 తేదీల్లో రాహుల్ పర్యటన..
5న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా,
14న అమిత్షా సభలు
8న ఓరుగల్లుకు కేటీఆర్!
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే రాష్ట్రంలో వేసవిని మించిన వేడి రాజుకుంటోంది. ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. ముఖ్యంగా విపక్ష కాంగ్రెస్, బీజేపీలు తమ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తమ పార్టీల జాతీయ నాయకత్వాలను రంగంలోకి దింపుతున్నాయి. ఈ నెల 6,7 తేదీల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటన ఇప్పటికే ఖరారయ్యింది.
6న వరంగల్లో బహిరంగ సభలో పాల్గొననుండగా.. ఏడవ తేదీన రాహుల్ ఓయూ సందర్శనకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేయడం, వీసీ నిరాకరించడం కాక పెంచింది. మరోవైపు పాలమూరు బహిరంగ సభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 5న రాష్ట్రానికి రానుండగా, పదిరోజుల వ్యవధిలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పర్యటించనుండటం రాజకీయంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
ఈ నెల 14న రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగే సభలో అమిత్ షా పాల్గొంటారు. ఇలావుండగా రాహుల్ వరంగల్ సభ మరుసటి రోజే రాష్ట్రమంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వరంగల్ పర్యటనకు పూనుకోవడం చర్చనీయాంశమవుతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన పేరిట వెళుతున్నా..ఇందులో రాజకీయ వ్యూహం కూడా దాగి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సంబంధిత వార్తలు