తెలంగాణ: కోర్టులకు లాక్డౌన్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని కోర్టులు, ట్రిబ్యునల్లకు లాక్డౌన్ను సెప్టెంబర్ 5 వరకు పొడిగిస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అత్యవసర కేసులు విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్తో పాటు నేరుగా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని హైకోర్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
నోటీసు ఇచ్చాక కదలిక వచ్చింది..
జమ్మూకాశ్మీర్ సరిహద్దులో అమరుడైన మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియా జాప్యంపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్పై హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, బొల్లం విజయసేన్ రెడ్డి ధర్మాసనం మంగళవారం విచారణకు ఆదేశించింది. గత నెల 31న ఫిరోజ్ ఖాన్ సతీమణి అకౌంట్లో 29 లక్షల రూపాయలను జమ చేస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాక కదలిక వచ్చిందని, అయన సతీమణి అకౌంట్లో ఇప్పటి వరకు డబ్బులు జమచేసినట్టు ఆధారాలేవి లేవని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో రెండు రోజుల్లో ఆధారాలు సమర్పిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసినట్లు కోర్టు ప్రకటించింది.