JP Nadda Hyderabad Visit: 1న హైదరాబాద్‌కు నడ్డా!

BJP Leader JP Nadda To Visit Hyderabad - Sakshi

భారీ ర్యాలీతో స్వాగత కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నిర్ణయం

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఇతర వీఐపీల బసకు ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు వేగవంత మయ్యాయి. భేటీకి సారథ్యం వహించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చే నెల 1న ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి సమావేశాలు జరిగే నోవాటెల్‌ వరకు భారీ ర్యాలీతో నడ్డాకు స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయించారు.

అదే రోజున సాయంత్రం నడ్డా అధ్యక్షతన జరిగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల భేటీలో.. కార్యవర్గ సమావేశాల ఎజెండా, చేయాల్సిన తీర్మానాలపై నిర్ణయాలు తీసుకుంటారు. 2న ఉదయం పదాధికారుల సమావేశం, సాయంత్రం 4 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 5 దాకా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉంటాయి. 3న సాయంత్రం పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగసభ ఉంటుంది. కాగా తుది సన్నాహాలపై సమీక్షించేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్, ఇతర నేతలు శనివారం హైదరాబాద్‌కు రానున్నారు.

బస కోసం రెండు చోట్ల ఏర్పాట్లు
వచ్చే నెల 2న హైదరాబాద్‌ రానున్న ప్రధాని మోదీకి బస కోసం నోవాటెల్‌ హోటల్‌తో పాటు, రాజ్‌భవన్‌లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని 2న మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కుగానీ, లేదా నేరుగా నోవాటెల్‌కు వెళ్లనున్నారు. ఆయనతోపాటు జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత  ఉన్న అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులకూ నోవాటెల్‌లో భద్రత, బస ఏర్పాట్లు చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top