భూపాలపల్లి: బీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గ విభేదాలు.. కవిత సమక్షంలో ఇరువర్గాల బాహాబాహీ
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతలు విబేధాలతో రచ్చకెక్కారు. మధుసూదనాచారి, గండ్ర మధ్య ఆధిపత్య పోరు కీలక నేతల సాక్షిగా బయటపడింది. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత పర్యటనలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో.. కార్మిక సంఘం భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. అయితే.. జిల్లాకు చెందిన నేతలు మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణరెడ్డిలు బలప్రదర్శనలు దిగారు. ఈ క్రమంలో శిలాఫలకం మీద మధుసూదనాచారి పేరు లేదని ఆయన వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈలోపు గండ్ర వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలకు దిగాయి. ఆపై తోపులాటకు దిగాయి. దీంతో పోలీసులు, ఇతర నేతలు జోక్యం చేసుకుని పరిస్థితి సరిదిద్దే యత్నం చేశారు.