కరోనాను జయించిన 50,814 మంది
రాష్ట్రంలో తాజాగా 2,012 పాజిటివ్ కేసులు..
ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 70,958
మరో 13 మంది మృతి.. మొత్తం మరణాలు 576
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా జయించిన వారి సంఖ్య 50 వేలు దాటింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు బుధవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ సోకిన వారిలో 50,814 మంది కోలుకున్నారు. ఇక దేశంలో కరోనా జయించిన వారు 66.31 శాతముండగా, మన రాష్ట్రంలో అది 71.6 శాతం ఉండటం గమనార్హం. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 576కు చేరుకుంది. దేశంలో మరణాల రేటు 2.10 శాతం ఉండగా, తెలంగాణలో అది 0.81 శాతం ఉండటం గమనార్హం. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు 5.22 లక్షలకు చేరుకున్నాయని శ్రీనివాసరావు వెల్లడించారు.
టెస్టులు పెరిగాయి.. కేసులూ పెరిగాయి
రాష్ట్రంలో మళ్లీ టెస్టుల సంఖ్య పెరిగింది. అదే స్థాయిలో కేసులూ అధికంగా నమోదయ్యాయి. గత రెండ్రోజులుగా టెస్టులు తక్కువ కాగా, అదే స్థాయిలో కేసుల సంఖ్య తక్కువగా నమోదైన సంగతి తెలిసిందే. తాజా బులెటిన్ ప్రకారం మంగళవారం (4వ తేదీ) 21,118 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,012 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోలుకున్న వారితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 70,958కి చేరింది. అలాగే ఒక్కరోజే కరోనాతో 13 మంది మృతి చెందారు. తాజాగా 1,139 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 19,568కి చేరిందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 532 ఉన్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 198, రంగారెడ్డి జిల్లాలో 188, వరంగల్ అర్బన్లో 127, ఖమ్మంలో 97, సంగారెడ్డిలో 89, నిజామాబాద్లో 83, నల్లగొండలో 49, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో 41 చొప్పున, మహబూబ్నగర్లో 51, జోగుళాంబ గద్వాలలో 48, జయశంకర్ భూపాలపల్లిలో 46, భద్రాద్రి కొత్తగూడెంలో 52, కామారెడ్డి జిల్లాలో 75 కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు.