సాక్షి, చైన్నె: చైన్నె ముగిలివాకానికి చెందిన ప్రముఖ దారుశిల్పి కడియం శ్రీనివాసరావు గత 35 ఏళ్లుగా తన శిల్పకళ నైపుణ్యంతో ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం త్వరలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలో పాల్గొనడానికి బర్మా టేక్ వుడ్తో బ్రహ్మాండ నాయకుడైన విష్ణు విగ్రహాన్ని అద్భుత రీతిలో రూపొందించారు. ఇందులో అష్టలక్ష్మిలతో కూడిన ద్వారపాలకు లు, గరుడ, హనుమాన్, ఏనుగులు, తామర, శంకుచక్రాలతో వైవిధ్యభరితంగా రూపొందించారు. గతంలో ఇండియన్ క్రాఫ్ట్ కౌన్సిల్ ద్వారా అవార్డును ఆయ న అందుకున్నారు. ఈయన రూపొందించిన రాముడు శ్రావణ కుమారుడు విగ్రహాన్ని ఢిల్లీ సమీపాన గల ద్వారక మధుర బృందావనంలో ప్రతిష్టించడం జరిగింది. అలాగే తమిళనాడు పూంబుహార్ స్టేట్ అవార్డును, యుటిలిటీ అవార్డును, టీం అవార్డును అందుకున్నారు, అలాగే కాంచీపురం లో కళా సాంస్కృతిక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ స్వస్థలం విజయనగరం జిల్లా, కొత్తూరు గ్రామం అని, ప్రస్తుతం చైన్నెలో నివాసముంటున్నట్లు తెలిపారు. తమ పూర్వీకుల నుంచి ఐదు తరాలుగా ఈ వృత్తిని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో కళాఖండాలు రూపొందించాలన్నదే తన ధ్యేయమని తెలిపారు.


