తిరుత్తణి: తిరుత్తణి పట్టణంలో 24 గంటల విద్యుత్ కోతకు నిరసనగా పట్టణ ప్రజలు రాస్తారోకో చేపట్టి తమ నిరసన తెలిపారు. తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులు వీచి బీభత్సం సృష్టిచడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పట్టణంతోపాటు పలు గ్రామాల్లో గురువారం రాత్రంతా విద్యుత్ సేవల్లో అంతరాయం చోటుచేసుకోవడంతో ప్రజలు చిమ్మచీకట్లో ఉక్కపోత నడుమ నిద్రలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది రాత్రంతా పనిచేసి చెట్లు తొలగించి తెగిన విద్యుత్ తీగలు, స్తంభాలు మార్చి తెల్లవారుజామున అనేక ప్రాంతాలకు విద్యుత్ సేవలను పునరుద్ధరించారు. అయితే తిరుత్తణి మున్సిపాలిటీలోని కుమారకుప్పం, పాపిరెడ్డిపల్లె ప్రాంతాల్లో మాత్రం 24 గంటల గడిచినా విద్యుత్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో ఆ ప్రాంతం ప్రజలు శుక్రవారం సాయంత్రం రాస్తారోకో చేపట్టారు. దీంతో తిరుత్తణి చిత్తూరు రాష్ట్ర రహదారిలో రాకపోకలు స్తంభించాయి. అలాగే తిరువలంగాడు ఆర్కేపేటలోని కృష్ణకుప్పం మేడు ప్రాంతాల్లో 24 గంటల పాటు విద్యుత్ కోతలతో ఆందోళన చెందిన జనం రాస్తారోకో చేపట్టి తమ నిరసన తెలిపారు.


