● పదిలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం
పళ్లిపట్టు: తాపీమేస్త్రి కుమారుడు పది ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో పళ్లిపట్టు ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ద్వితీయ స్థానం సాధించి తన సత్తా చాటాడు. పళ్లిపట్టు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థిని ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో మార్చిలో నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఇందులో కరింబేడు, వీసీఆర్ కండ్రిగ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎప్పటిలాగే బాలికలు హవా ప్రదర్శించారు. కాగా పళ్లిపట్టు ప్రభుత్వ బాలుర మహోన్నత పాఠశాలలో టెన్త్ చదువుకున్న కీళ్కాళ్పట్టడ గ్రామానికి చెందిన తాపిమేస్త్రి కుమారుడు రోహిత్ పబ్లిక్ పరీక్షల్లో తమిళం 99, ఆంగ్లం 99. విజ్ఞానశాస్త్రం 100, సాంఘికశాస్త్రం 99 మార్కులతో 497 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలోని ప్రభుత్వ పాఠశాలల స్థాయిలో ద్వితీయ స్థానం సాధించగా తిరువళ్లూరు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న తాపిమేస్త్రి కుమారుడు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడంతో సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని పాఠశాలకు ఆహ్వానించిన ఉపాధ్యాయులు సత్కరించి అభినందనలు తెలిపారు.


