ఆధిపత్య రహిత సమాజం నిర్మిద్దాం
న్యూస్రీల్
సాక్షి,చైన్నె: అందరికీ అన్నీ లక్ష్యంగా అందరూ సమానంగా ఉండాలన్న కాంక్షతో ప్రభుత్వం ముందుకెళుతోందని సీఎం స్టాలిన్ అన్నారు. ఆధిపత్య రహిత సమాజం నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఆదర్శం, పరిపాలనా బాధ్యత అంటే అందరికీ అన్నీ నెరవేర్చడం, పథకాల అమలు ద్వారా విజయాలను చేర్చుకోవడం అని వ్యాఖ్యానించారు.
చైన్నె కోట్టూరుపురంలోని అన్నా శతజయంతి స్మారక గ్రంథాలయంలో తాయ్ మానవర్ పథకం మేరకు, విద్య, స్వయం ఉపాధి. ప్రభుత్వ సంక్షేమ పథకం, వివిధ సంక్షేమాల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు. రూ.265.50 కోట్ల విలువైన 9,371 సంక్షేమ పథకాలను అందజేశారు. 10 గ్రామ పంచాయతీలకు సామాజిక సామరస్యం అవార్డులను ప్రదానం చేశారు. ఈమేరకు 2025–26సంవత్సరానికిగాను రామనాథపురం జిల్లా –మేలమడై, విల్లుపురం జిల్లా– పరయంతంగల్, తెన్కాసి జిల్లా–కె. అలంకులం, కళింగపట్టి, తంజావూరు జిల్లా– సూర్యనార్కోయిల్, వెంకటసముద్రం, సేలం జిల్లా – మణివిలుందన్, చెంగల్పట్టు జిల్లా– మన్నావక్కం, కోయంబత్తూర్ జిల్లా– ఒట్టేరి పాలయం, నాగపట్నం జిల్లా– తేవూరు పంచాయతీలకు అవార్డులతో పాటు రూ.కోటి చొప్పున నిధులను సీఎం అందజేశారు. ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ నేతృత్వంలో రూ.74.20 కోట్లతో విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, తిరునల్వేలి, అరియలూరు, కరూర్, పెరంబలూరు, తిరుచ్చి, మదురై, తేని, దిండుగల్, తంజావూరు, మైలాడుతురై, కోయంబత్తూరు జిల్లాల్లో నిర్మించిన సామాజిక న్యాయ హాస్టళ్లు, గ్రామ విజ్ఞాన కేంద్రాల భవనాలను సీఎం ప్రారంభించారు. డాక్టర్ అంబేడ్కర్ పేరిట విదేశీ విద్య స్కాలర్ షిప్ పథకం ద్వారా ట్రాన్స్జెండర్కు రూ.36 లక్షల స్కాలర్ షిప్, అండర్ గ్రాడ్యుయేట్, పోసు్ట్రగాడ్యుయేట్, టెక్నికల్ కోర్సులలో విద్యార్థుల అభ్యున్నతికి చర్యలతో పాటు ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు. అంబేడ్కర్ ఇండస్ట్రియల్ ప్రోత్సాహక పథకం కింద 28 మంది లబ్ధిదారులకు రూ.2 కోట్ల మూల ధన గ్రాంట్ను అందజేశారు. మంత్రులు ఎం సుబ్రమణియన్, పీకే శేఖర్బాబు, మదివేందన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు.
అందరూ సమానమే
ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా అందరికీ అన్ని దరి చేరాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. అందరూ సమానంగా ఉండాలని, ఆధిపత్య రహిత సమాజం నిర్మిద్దామని పిలుపునిచ్చారు. అవకాశాలు నిరాకరించబడిన వారికి అవకాశాలను సృష్టించడం, వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే విధంగా ద్రావిడ మోడల్ పాలనలో మరిన్ని సంక్షేమ సహాయక పథకాలు అమల్లోకి రాబోతున్నాయన్నారు. ఆదిద్రావిడ, గిరిజన విద్యార్థులు విద్యాపరంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలలో 3 లక్షల 3 వేల 703 ఉచిత గృహ భూమి పట్టాలను జారీ చేశామని అన్నారు.
శ్రీలంకకు సాయం
దిత్వా తుపాన్ శ్రీలంకను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. తమిళనాడుకు పొరుగున ఉన్న శ్రీలంక వాసులను ఆదుకునేందుకు డీఎంకే ప్రభుత్వం ముందుకు వచ్చింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని శ్రీలంక ప్రజలకు సాయంగా పప్పులు, చక్కెర, పాలపొడి పంపిణీకి నిర్ణయించారు. చైన్నె హార్బర్ నుంచి 650మెట్రిక్ టన్నులతో వస్తువులు, తూత్తుకుడి హార్బర్ నుంచి 300 మెట్రిక్ టన్నులు నౌకల ద్వారా పంపించారు. ఈ నౌకలకు సీఎం స్టాలిన్ జెండా ఊపారు.
వంతెనకు వేలు నాచ్చియార్ పేరు
దక్షిణ జిల్లాల్లో ప్రధాన నగరంగా ఉన్న మదురై మేలమడై జంక్షన్లో నిర్మించిన కొత్త ఫ్లై ఓవర్ను ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ వంతెనకు వీర నారి వేలు నాచ్చియార్ ఫ్లై ఓవర్గా నామకరణం చేయడానికి సీఎం స్టాలిన్ నిర్ణయించారు.
ఆధిపత్య రహిత సమాజం నిర్మిద్దాం
ఆధిపత్య రహిత సమాజం నిర్మిద్దాం
ఆధిపత్య రహిత సమాజం నిర్మిద్దాం
ఆధిపత్య రహిత సమాజం నిర్మిద్దాం


