కరూర్ ఘటనపై సుప్రీంకోర్టు కమిటీ దృష్టి
సాక్షి, చైన్నె: కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు కమిటీ దృష్టి పెట్టింది. సీబీఐ విచారణ తీరును సోమవారం ఆ కమిటీ పరిశీలించింది. సెప్టెంబరు 27వ తేదీన కరూర్లో టీవీకే నేత విజయ్ ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో 41 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. ఈ కేసును మద్రాసు హైకోర్టు ఆదేశాలతో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ బృందం తొలుత విచారించింది. ఆ తదుపరి సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారిస్తోంది. గత నెల రోజులుగా సీబీఐఅ ధికారులు కరూర్లో తిష్ట వేసి పలు కోణాలలో విచారణ జరుపుతూ వస్తున్నారు. టీవీకే ముఖ్యనేతల వద్ద సైతం విచారణ పూర్తి చేశారు. ఈ దర్యాప్తు సరైన మార్గంలో సాగే దిశగా పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగీ నేతృత్వంలో కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. ఈ కమిటీలో ఇద్దర ఐపీఎస్ అధికారులతో పాటూ తమిళనాడు ప్రభుత్వం తరపున హోం శాఖ కార్యదర్శి ధీరజ్కుమార్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు. నెల రోజులుగా జరుగుతున్న విచారణ తీరు తెన్నులపై సుప్రీంకోర్టు కమిటీ దృష్టి పెట్టింది.కరూర్కు వచ్చిన ఈ కమిటీ ఇప్పటి వరకు జరిగిన సీబీఐ విచారణ, వెలుగులోకి వచ్చిన అంశాల గురించి సమాచారాన్ని రాబట్టింది.


