
అధికారులే సమాచార సారథులు
● ప్రతినిధులుగా నలుగురు ఐఏఎస్లు ● నియమించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి,చైన్నె : సీనియర్ అధికారుల్నే సమాచార సారథులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సీనియర్ ఐఏఎస్లకు పలు శాఖలలోని విభాగాలను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాలు, వివరణలు, పథకాలు, ఇతర కార్యక్రమాలన్నీ ఈ అధికారులే ప్రజలలోకి తీసుకురానున్నారు. వివరాలు.. తమిళనాడు ప్రభుత్వ విభాగాల ముఖ్యమైన సమాచారం, పథకాలు, కార్యక్రమాలు, అవసరమైన వర్గాలలో మీడియా ద్వారా సకాలంలో సముచిత సమాచారం అందించే దిశగా, ఇతర ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకునే రీతిలో ఐఏఎస్ అధికారులను ఎంపిక చేశామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ప్రభుత్వ ప్రతినిధులుగా ఈ ఐఏఎస్లను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
నలుగురికి బాధ్యతలు
సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వ ప్రచార, సమాచార సారథులుగా రంగంలోకి దించడమే కాకుండా వారికి ఆయా శాఖలు, విభాగాలను కేటాయించారు. వీటికి సంబంధించిన సమగ్ర వివరాలన్నీ ఇక ఈ అధికారులే సమన్వయం చేయనున్నారు. సమాచారాలను ప్రజలకు తెలియజేయనున్నారు. ఈ మేరకు తమిళనాడు విద్యుత్ బోర్డు చైర్మన్, ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. రాధాకృష్ణన్ను నియమిస్తూ, ఆయన పరిధిలోకి విద్యుత్, వైద్యం, రవాణా ,సహకార సంఘాలు, ఆహారం, వినియోగదారుల సంక్షేమం, విదేశాల్లో నివసిస్తున్న తమిళుల సంక్షేమం, పాఠశాల విద్య విభాగం, ఉన్నత విద్య, చేనేత, హస్తకళలు, వస్త్రాలు, ఖద్దర్ రంగాలు, మానవ వనరుల నిర్వహణ శాఖలను అప్పగించారు.
గ్రామీణావృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి గగన్ దీప్ సింగ్ బేడికి గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్, మున్సిపల్ పరిపాలన, నీటి సరఫరా, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య సంపద, మత్స్యకారులు సంక్షేమ, వ్యవసాయం, రైతు సంక్షేమం, జల వనరులు, పర్యావరణం, వాతావరణ మార్పు, అటవీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు,పెట్టుబడులు ప్రోత్సాహం, వాణిజ్య విభాగం, సహజ వనరుల విభాగం అప్పగించారు.
రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి , ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి ధీరజ్ కుమార్కు హోం వ్యవహారాలు, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖను కేటాయించారు
రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రభుత్వ అదనపు ప్రధానకార్యదర్శి పి. అముదాకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ, సాంఘిక సంక్షేమం, మహిళా హక్కులు, వికలాంగుల సంక్షేమం, కార్మిక సంక్షేమం , నైపుణ్యాల అభివృద్ధి, ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమం, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, రహదారులు, చిన్న ఓడరేవులు, పర్యాటకం, సాంస్కృతికం, హిందూ మత దేవాదాయం, ప్రత్యేక ప్రాజెక్టుల అమలు శాఖలను అప్పగించారు. ప్రభుత్వ ప్రతినిధులకు ఆయా విభాగాల కార్యదర్శులు, ఇతర అధికారులు సంప్రదింపులలో ఉండాలి. తమకు కేటాయించిన శాఖలలలోని అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు, సమాచారాలుసేకరిస్తూ, ప్రభుత్వ కార్యక్రమాల పరంగా సమగ్ర సమాచారాలను ఈ ఐదుగురు ప్రభుత్వ ప్రతినిధులే ప్రజలకు సకాలంలో సమాచారాలను అందిస్తారని ప్రభుత్వం ప్రకటించింది.

అధికారులే సమాచార సారథులు

అధికారులే సమాచార సారథులు