కూలీల కొరత.. రైతు వ్యథ
అప్పు చేసి కూలి చెల్లించాల్సి వస్తోంది
తిరుమలగిరి (తుంగతుర్తి) : మోంథా తుపాన్ పత్తి రైతులను నిండా ముంచింది. వర్షాల కారణంగా పత్తి చేలన్నీ దెబ్బతిన్నాయి. చెట్లపై ఉన్న పత్తి కాయలు కుళ్లిపోయాయి. దీంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీనికి తోడు ఉన్న కాస్త పత్తి ఏరుదామంటే ఇప్పుడు కూలీల కొరత ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకురావాలంటే కూలి రేట్లు రెండింతలై రైతులపై ఆర్థికభారం పడుతోంది.
93,826 ఎకరాల్లో సాగు
జిల్లా వ్యాప్తంగా 93,826 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. జూన్, జూలై మాసాల్లో అదునుకు కురిసిన వర్షాలకు రైతులు గుంటుకలు తోలుకొని ఎరువులు పెట్టుకున్నారు. సరైన సమయంలో ఎరువులు పెట్టడంతో పూత కాపుకొచ్చింది. అప్పటి పరిస్థితులను బట్టి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు, అధికారులు అంచనా వేశారు. కానీ వీరి అంచనాలను వర్షాలు తలకిందులు చేశాయి. వరుస వర్షాలకు పత్తి చేలన్నీ పూర్తిగా దెబ్బ తిన్నాయి. మోంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పత్తి అంతా తడిసి రాలిపోయింది. సగానికి సగం దిగుబడి తగ్గే పరిస్థితి నెలకొన్నది. వర్షాల కారణంగా పత్తి చేను పెద్ద ఎత్తున దెబ్బ తినడంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. దీనికి తోడు కూలీల కొరత ఉండటంతో పత్తి అంతా చేలలోనే ఉంటోంది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాకు మద్దతు ధర రూ.8100 ఉండగా తేమ శాతం అధికంగా ఉండటంతో రైతుల నుంచి క్వింటాకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకే కొనుగోలు చేస్తున్నారు.
సరిహద్దు జిల్లాల నుంచి..
చెట్లపై ఉన్న కొదిపాటి పత్తిని ఏరడానికి రైతులు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. జిల్లాకు సరిహద్దున ఉన్న మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం జిల్లాల నుంచి కూలీలను ఆటోలు, టాటాఏస్ వాహనాల్లో ఉదయం తీసుకొచ్చి సాయంత్ర పంపిస్తున్నారు. పత్తి ఏరడాకి గతంలో ఒక్కో కూలీకి రూ.300 నుంచి రూ.350 చెల్లించే వారు. వారం రోజులుగా కేజీల చొప్పున ఏరిస్తున్నారు. కేజీకి రూ.15 నుంచి రూ.20 వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు వాహనం కిరాయితో పాటు డ్రైవర్కు బత్తా ఇవ్వాల్సివస్తోంది. దీంతో పత్తి రైతులపై అదనపు భారం పడుతోంది.
మూడున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ఇప్పటి వరకు 2 ఎకరాలలో మాత్రమే ఒకసారి పత్తి తీశాను. పత్తి తీయాల్సి ఉన్నా కూలీల కొరత ఏర్పడింది. కూలీలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు భారంగా మారాయి. గ్రామానికి చెందిన కూలీలతో వ్యవసాయ పనులు చేయిస్తే కూలి డబ్బులు కొంత ఆలస్యంగా చెల్లించేందుకు అవకాశం ఉండేది. వేరే గ్రామాల నుంచి పత్తి తీసేందుకు కూలీలకు సాయంత్రమే అన్ని డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. అప్పు చేసి సాయంత్రమే కూలి చెల్లించాల్సి వస్తోంది.
– నర్సయ్య, రైతు, తాటిపాముల.
ఈ ఫొటోలో కన్పిస్తున్న రైతు పేరు వెంకన్న. సొంతూరు తిరుమలగిరి మండలం
తొండ గ్రామం. ఈ ఏడాది వానాకాలంలో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. ఎకరాకు రూ.10 వేల చొప్పున కౌలు కింద మొత్తం రూ.30 వేలు ముందుగానే చెల్లించాడు. ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశించాడు. కానీ వరుస వర్షాల కారణంగా చేలల్లోని పత్తి కాయలు సగానికి పైగానే కుళ్లి పోయాయి. ఎకరాకు కనీసం 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉన్నకొద్దిపాటి పత్తి ఏరిద్దామంటూ కూలీల కొరత ఏర్పడింది. దీంతో ఇతర
ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొచ్చాడు. వీరికి పత్తి ఏరినందుకు కిలోకు రూ.16 చొప్పున చెల్లిస్తున్నారు.
ఫ ఇప్పటికే తుపాన్ కారణంగా
దెబ్బతిన్న పత్తి పంట
ఫ దిగుబడిపై తీవ్ర ప్రభావం
ఫ పత్తితీతకు కూలీలు దొరకని పరిస్థితి
ఫ ఇతర ప్రాంతాల నుంచి
తీసుకొస్తున్న కర్షకులు
ఫ రెండింతలవుతున్న ఖర్చులు
కూలీల కొరత.. రైతు వ్యథ
కూలీల కొరత.. రైతు వ్యథ
కూలీల కొరత.. రైతు వ్యథ


