టీకాలతోనే పశువులకు రక్షణ
త్రిపురారం: ప్రతి యేటా వివిధ రకాల వ్యాధులతో పశువులు, జీవాలు వందల సంఖ్యలో మృత్యువాతపడుతున్నాయి. దీంతో రైతులు, కాపరులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. పశువుల మరణాలను నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రతి సంవత్సరం రెండుసార్లు ప్రభుత్వ ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం నవంబర్ 14 వరకు కొనసాగుతుంది. గాలికుంటు వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు త్రిపురారం మండల పశువైధ్యాధికారి డాక్టర్ నాగేందర్ మాటల్లో..
గాలికుంటు వ్యాధి లక్షణాలు.
పశువులకు గాలికుంటు వ్యాధి సూక్ష్మక్రిముల వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకిన పశువులు 24 గంటల్లోనే చిక్కిపోయి అల్సర్కు గురవుతాయి. రెండు నుంచి ఆరు వారాల వరకు జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నోరు, పెదాలు, నాలుక, చన్నులు, కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుంది. పశువులు ఎప్పటికప్పుడు ముడుచుకొని పడుకుంటాయి. వ్యాధి కారణంగా పశువులు, మేత నీళ్లు సరిగా తీసుకోలేవు. నెమరు వేయలేవు. నోటి నుంచి సొంగ లేక నురుగ కారుతూ తక్కువ సమయంలోనే బరువు తగ్గిపోతాయి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గి, పశువుల్లో పునరుత్పత్తి తగ్గిపోతుంది. చూడి పశువులు ఈసుకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్ల మధ్య పుండ్లు పడడం వల్ల సరిగ్గా నడవలేవు. పాల ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా వ్యాధి నిరోధకశక్తి తగ్గి కొన్న సార్లు పశువులు.. వ్యాధి సోకిన పశువుల పాలు తాగడం వల్ల దూడలు చనిపోతుంటాయి.
చికిత్స విధానం
1. నోరు, పెదాలు, నాలుక, చన్నులు, కాళ్ల గిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ లేదా నార్మల్ సైలెన్ నీటితో పరిశుభ్రంగా కడగాలి.
2. కడిన తర్వాత ఆరనిచ్చి యాంటీసెప్టిక్ లోషన్ రాసి అవసరమైతే ఈగలు, దోమలు వాలకుండా పుండ్లకు కట్లు కట్టాలి.
3. రెండోసారి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి యాంటీబయోటిక్స్ మందులు, పశువుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి బీ–కాంప్లెక్స్ మందులు ఉపయోగించాలి.
పాటించాల్సిన జాగ్రత్తలు
1.వ్యాధి సోకిన పశువులకు వాడిన పరికరాలను దూరంగా పడేయాలి. లేదంటే ఇతర పశువులకు గాలికుంటు వ్యుధి సోకే అవకాశం ఉంటుంది.
2. వ్యాధి సోకిన పశువులను మందలో ఉంచకుండా వేరుగా కట్టేయాలి.
3. పశువుల పాకలను ఎప్పటికప్పుడు నీరు చల్లి శుభ్రం చేసుకోవాల.ఇ వారానికి ఒకసారి సున్నం చల్లుతూ ఉండాలి.
4. జబ్బు చేసిన పశువు నుంచి తీసిన పాలను ఎక్కువగా వేడి చేసుకుని వినియోగింకోవాలి.
5. పశువులను మేతకు తోలుకెళ్లేటప్పుడు నిల్వ ఉన్న నీటిని తాగకుండా జాగ్రత్త పడాలి.
6. వ్యాధి సోకిన పశువు చనిపోతే గొయ్యి తీసి అందులో బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతి పెట్టాలి.
ఫ నవంబర్ 14 వరకు గాలికుంటు నివారణ టీకాల పంపిణీ
టీకాలతోనే పశువులకు రక్షణ


