నేడు ప్రపంచ జనాభా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

Jul 11 2025 5:35 AM | Updated on Jul 11 2025 5:35 AM

నేడు

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

ఉమ్మడి జిల్లాలో

1991 తరువాత నుంచి క్రమంగా తగ్గుదల

సంతాన పరిమితితో తగ్గుతున్న

జనాభా శాతం

మరో 20 ఏళ్లలో యువత కంటే సీనియర్‌ సిటిజన్ల సంఖ్యే ఎక్కువకానుంది

2011 నాటికి క్షీణించిన జనాభా

పెరుగుదల రేటు

ఉమ్మడి జిల్లాలో యువతరం తగ్గిపోతోంది. పెరుగుతున్న పోషణ భారం.. సంతాన పరిమితికి కారణమవుతోంది. 1951లో మొదటిసారిగా జనాభా లెక్కలు చేసిన తరువాత పదేళ్లపాటు పెద్దగా జనాభా పెరుగకపోయినా, ఆ తరువాత 30 ఏళ్ల పాటు అంటే 1971 వరకు జిల్లాలో జనాభా గణనీయంగా పెరిగింది. మళ్లీ 1991 తరువాత నుంచి జనాభా సంఖ్యా పరంగా పెరిగినా, అంతకుముందు సంవత్సరాలతో పోల్చుకుంటే పెరుగుదల రేటు మాత్రం క్రమంగా క్షీణిస్తోంది. దీంతో వచ్చే 20 ఏళ్లలో సీనియర్‌ సిటిజన్ల సంఖ్యే ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు కాదు ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలన్న సూచనలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం పెరిగిన జీవన ప్రమాణాలు, వస్తున్న ఆదాయానికి, చేయాల్సిన వ్యయానికి పొంతన లేకపోవడం, తక్కువ ఆదాయం, ఎక్కువ ఖ ర్చుల కారణంగా పరిమిత సంతానికే నేటి యువత మొగ్గుచూపుతోంది. తక్కువ మందిని కని సక్రమంగా పెంచి, అన్నీ సమకూర్చగలిగితే చాలు అన్నట్లుగా భావిస్తుస్తోంది. సంపన్న వర్గాల నుంచి పేద, మధ్య తరగతి వరకు చిన్న కుటుంబాలకే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా జనాభా పెరుగుదల ఏటేటా తగ్గిపోతోంది.

ఒకప్పుడు బలవంతంగా కుటుంబ నియంత్రణ

ఒకప్పుడు జనాభా పెరుగుదలను నియంత్రించేందుకు ప్రభుత్వమే ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు అన్న నినాదాన్ని ప్రజల్లోకి తెచ్చింది. అయితే అదే నినాదం ఇప్పటికీ అమలవుతూనే ఉంది. 1970 తరువాత భారత ప్రభుత్వం దేశంలో జనాభా ఎక్కువ అవుతుందని, ఆహార పదార్ధాల కొరత ఏర్పడుతుందన్న ఆలోచనతో కుటుంబ నియంత్రణను అమల్లోకి తెచ్చింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టింది.

రెట్టింపునకు మించి పెరిగిన జనాభా

ఉమ్మడి జిల్లాలో 1951లో చేపట్టిన జనాభా లెక్కల ప్రకారం ఉన్న జనాభా కంటే ఇప్పుడు జనాభా రెండు రెట్లు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జనాభా 15,43,975 ఉండగా, 2011 సంవత్సరం నాటికే అది 34,88,809కు పెరిగింది. ఈ 15 ఏళ్లలో మరో 5 లక్షలకు పైగా పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. సంఖ్యాపరంగా పెరిగినా.. పెరుగుదల రేటు మాత్రం క్షీణిస్తోంది. 1951 నుంచి 1961 వరకు 1.97 శాతమే పెరిగింది. ఆ తరువాత పదేళ్లలో 1971 నాటికి 13.45 శాతం పెరిగింది. 1981 నాటికి 20.18 శాతం, 1991 నాటికి 20.07 శాతం జనాభా పెరిగింది. ఇక తరువాత పెరుగుదల రేటు క్షీణిస్తూ వస్తోంది. తరువాత పదేళ్లకు అంటే 2001 నాటికి పెరుగదల రేటు 12.19 శాతానికి పడిపోయింది. 2011 నాటికి జనాభా పెరుగుదల రేటు 6.91 శాతానికి తగ్గింది.

ఉమ్మడి కుటుంబాలు లేక..

అప్పట్లో జనాభా పెరుగుదలను తగ్గించేందకు తీసుకువచ్చిన కుటుంబ నియంత్రణను ఇప్పటి దంపతులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఒక్కరిద్దరితోనే సరిపెట్టుకుంటున్నారు. పెరుగుతున్న జీవన వ్యయంతో ఒకరిద్దరు పిల్లలను కనేందుకు నేటి యువత మొగ్గు చూపుతోంది. మరోవైపు ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు పుట్టిన బిడ్డను చూసుకునేందుకు ఉమ్మడి కుటుంబంలో నానమ్మ, తాతయ్య, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, చిన్నాన్నలు, చిన్నమ్మలు, అత్తమ్మలు ఇలా చాలా మంది ఉండేవారు. కానీ ఇప్పుడు బతుకు పోరులో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ :

రోజుకు 32 జననాలు

సూర్యాపేట జిల్లాలో రోజుకు సగటున 32 మంది జన్మిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 975 మంది, మేలో 922 మంది, జూన్‌లో 919 మంది జననాలు నమోదయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో ప్రతి పదేళ్లలో జనాభా పెరుగుదల ఇలా..

సంవత్సరం జనాభా పెరుగుదల వృద్ధి శాతం

1951 15,43,975 -- --

1961 15,74,946 37,971 1.97

1971 18,19,738 2,44,792 13.45

1981 22,79,681 4,59,947 20.18

1991 28,52,092 5,72,407 20.07

2001 32,47,982 2,95,890 12.19

2011 34,88,809 2,40,827 6.91

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం 1
1/1

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement