
ఆయిల్పామ్ లక్ష్యం పూర్తి చేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో ఆయిల్పామ్ సాగు లక్ష్యం పూర్తయ్యే విధంగా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ పి. రాంబాబు సూచించారు. ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ బి.బాబు తన సిబ్బందితో కలిసి కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆయిల్ పామ్ సాగు ఏవిధంగా ఉందని అదనపు కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాకు ప్రభుత్వం ఇచ్చిన 3,000 ఎకరాల లక్ష్యం పూర్తి అయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి తీగల నాగయ్య, ప్రాంతీయ ఉద్యాన అధికారులు మహేష్, ప్రమిత , ఆయిల్ ఫామ్ కంపెనీ జనరల్ మేనేజర్ బి. యాదగిరి, మేనేజర్ జె. హరీష్, ఫీల్డ్ ఆఫీసర్లు, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.
31లోపు పూర్తి చేయాలి
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో రైతులకు అవగాహన కల్పించి ఈనెల 31లోగా ఆయిల్పామ్ సాగు లక్ష్యం పూర్తి చేయాలని రాష్ట్ర ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ బి.బాబు సూచించారు. బుధవారం సూర్యాపేట జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో అధికారులు, పతంజలి ఆయిల్ పామ్, డ్రిప్ కంపెనీ సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో బాబు మాట్లాడారు. జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రైతులకు అందించే పథకాల లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు, ఆయిల్ పామ్, డ్రిప్ కంపెనీ సిబ్బంది కృషి చేయాలని కోరారు.
కావాల్సినంత యూరియా అందజేస్తాం
కోదాడరూరల్ : వానాకాలం వ్యవసాయ సీజన్కు కావాల్సినంత యూరియాను దశల వారీగా రైతులకు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి(డీఏఓ) శ్రీధర్రెడ్డి తెలిపారు. బుధవారం కోదాడ పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో స్టాక్తో పాటు రికార్డులను తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 16వేల మెట్రిక్ టన్నుల యూరియా, 38వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు తొందరపడి ఎక్కువ రేటుకు యూరియా కొనుగోలు చేయవద్దని సూచించారు. డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ రేటుకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ ప్రశాంతి, ఎంఏఓ పాలెం రజిని పాల్గొన్నారు.
బకాయిలు ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట) : యాసంగి సీజన్ 2023– 24 లో ఎఫ్సీఐకి మిల్లర్లు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలని అదనపు కలెక్టర్ పి. రాంబాబు సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో మిల్లర్లు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో డీఎస్ఓ మోహన్ బాబు, ఏఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, డీటీలు, ఆర్ఐలు, మిల్లర్లు పాల్గొన్నారు.

ఆయిల్పామ్ లక్ష్యం పూర్తి చేయాలి