కరోనా కల్లోలం; ఒక్కరోజులో 88 మంది మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,785 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,99,749కి చేరింది. ఈ మేరకు తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు శుక్రవారం హెల్త్బులెటిన్ను విడుదల చేశారు. కరోనా మహమ్మారితో ఇవాళ 88 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 3,320 గా ఉంది. కాగా.. రాష్ట్రంలో 53,132 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇవాళ కరోనా నుంచి కోలుకుని 6,504 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,43,297కి చేరింది. (90 మంది ట్రైనీ పోలీసులకు కరోనా)
ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కోవిడ్-19 బాధితులకు ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 76.5 కోట్ల అదనపు నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశంలోనే రెండవ జాతీయ స్థాయి ప్లాస్మా బ్యాంకును గురువారం రాష్ట్రంలో ప్రారంభించారు. మేము ఇది వరకు ప్లాస్మా పద్ధతిని ట్రయల్ ప్రాతిపదికన నిర్వహిస్తున్నాము. ఇప్పుడు మాకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం ఉంది. మొత్తం ప్లాస్మా బ్యాంకును జాతీయ స్థాయిలో రూ. 2.34 కోట్లతో తెరిచారు. కోవిడ్ బాధితుల్ని డిశ్చార్జ్ చేసిన తరువాత, వారి ప్లాస్మాను దానం చేయడానికి 14 రోజులు వేచి ఉండాలి. అప్పుడు ప్లాస్మా రక్తం నుంచి వేరుచేయబడుతుంది. ఇది ఒక సంవత్సరం వరకు నిల్వ చేసుకొని ఉపయోగించవచ్చు. కరోనా పరీక్షల విషయంలో కూడా ఇప్పటిదాకా 2 మిలియన్ల పరీక్షలు నిర్వహించాము. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరీక్షల పరంగా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాము అని మంత్రి విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. (కరోనా టెస్ట్కు రూ.15వేలు, పాజిటివ్ వస్తే రూ.79వేలు)