శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆమదాలవలస నియోజకవర్గంలో పలు సమస్యలు, అక్రమాలను అరికట్టాలని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కోరారు. ఆమదాలవలస మండలం కొత్తరోడ్డు వద్ద గల బావాజీ మఠం భూములకు 400 ఏళ్ల చరిత్ర ఉందని, వాటిని ఆక్రమించుకుని లే అవుట్ వేస్తున్నారని తెలిపారు. ఈ భూములను రెవెన్యూ అధికారులతో సర్వే చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లేఅవుట్ వేస్తున్నారని, వాటిని నిలుపుదల చేయాలని, ప్రభుత్వ దేవదాయ ఆస్తులను కాపాడాలని ఆయన కోరారు. పొందూరు మండలంలోని గణేష్ గాయత్రి స్టోన్ క్రషర్ కూడా ఆమదాలవలస ఎమ్మెల్యే బినామీలు నడుపుతున్నారని, ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతోందని, ఈ భూమిని చౌకగా కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. గాజులు కొల్లి వలస గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఉన్న పాఠశాల భవనాన్ని రాత్రికి రాత్రి కూల్చేశారని, కూల్చిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఆమదాలవలస మండలం రామచంద్రపురం గ్రామంలో రోడ్డుపై భవ నం నిర్మిస్తున్నారని, తహసీల్దార్ ప్రత్యేకాధికారిగా ఉన్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. పురుషోత్తపురం, ముద్దాడపేటలో అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలని కోరారు.


