మోసం గురూ..!
కొత్తరకం..
● బంగారం ఆశచూపుతూ మోసం చేస్తున్న వ్యక్తులు ● ఆన్లైన్లో వివరాలతో ఫోన్కాల్స్ ● అప్రమత్తంగా ఉండాలని సూచనలు
టెక్కలి రూరల్:
ఇటీవల కాలంలో కొత్త తరహా మోసాలు అధికమైపోతున్నాయి. చాలామంది వ్యాపారులను టార్గెట్గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. గత కొద్ది నెలలుగా ఇటువంటి మోసాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనిలో ప్రధానంగా బంగారం ఆశ చూపుతూ వస్తున్న ఫోన్కాల్ మోసాలు ఒక రకమైతే.. వ్యాపారుల బలహీనతను ఆధారంగా చేసుకుని చేస్తున్న మోసాలు మరోరకం.
మన సమాచారమే ఆయుధం
చాలా మంది వ్యాపారులు తమ వ్యాపారం అభివృద్ధి కోసం ఆన్లైన్లో తమ వ్యాపారం పేరు, ఫోన్ నంబర్ నమోదు చేసుకుంటారు. అయితే వాటిని ఆధారంగా చేసుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ముందుగా మన నంబర్కు ఫోన్చేసి బాగా తెలిసిన వ్యక్తి వలే మాట్లాడుతారు. మనతో పరిచయం పెంచుకుని తర్వాత వారు చెప్పాల్సిన విషయం గూర్చి చెబుతారు. నేను కేరళ వద్ద రామేశ్వరంలో పనిచేస్తున్నాను. అక్కడ జేసీబీతో మట్టి తీస్తుండగా 20, 30 అడుగుల లోతులో ఒక మట్టికుండలో బంగారం దొరికిందని చెబుతారు. సుమారు 2, 3 కేజీలు ఉంటుందని.. ఎవరికీ తెలియకుండా తెచ్చామని చెబుతూ సమాచారం ఇస్తారు. అయితే దానిపై మనం ఆసక్తిగా ఉన్నట్లు వారు గ్రహిస్తే వీడియో కాల్ చేసి బంగారం చూపిస్తారు. అనంతరం మనకు నమ్మకం కలిగిందని గ్రహించాక బంగారం ఎవరికి తెలియకుండా తీసుకురావాలంటే కొంత మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతుందని చెబుతూ కొంత మొత్తంలో డబ్బులు వేయమని కోరుతారు. అది నమ్మి డబ్బులు వేసినట్లు అయితే మోసపోయినట్లే.
డబ్బులు పంపితే అంతే...
అదేవిధంగా ఇటీవల కాలంలో టెక్కలిలో పలు చికెన్ షాపులకు ఫోన్చేసి మీది పలానా చికెన్ షాపు కదా.. నేను ఒక టీచర్ను అని చెబుతారు. సాయంత్రం తమ స్కూల్లో ఫంక్షన్ ఉందని చెప్పి.. 50 కేజీల చికెన్ కావాలి కొట్టి ఉంచేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. అక్కడికి కొంత సమయానికి మళ్లీ ఫోన్చేసి సార్ నేను ఒక దగ్గర ఉన్నాను నా ఫోన్ పే అవ్వడం లేదు. కావున రూ.5 వేలు నేను ఒక నంబర్ చెబుతాను.. దానికి ఫోన్పే చేస్తే వచ్చేటప్పుడు మీకు మొత్తం డబ్బులు కలిపి ఇస్తానని చెబుతూ మోసానికి పాల్పడుతున్నారు. ఒకవేళ వారు చెప్పినట్లు డబ్బులు వేసినట్లయితే అక్కడికి కొంత సమయానికి ఆ నంబర్ మరి పని చేయకుండా పోతుంది. అలాగే చాలా హోటల్స్లో సైతం ఈ తరహాలోనే భోజనాలు పార్సిల్ చేయాలని చెబుతూ మోసం చేస్తున్నారు. అదేవిధంగా టైల్స్ షాపులకు ఫోన్చేసి నేను ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్ని అని చెప్పి మోసం చేస్తున్నారు. లేడీస్ కార్నర్ షాపులకు ఫోన్లు చేసి పండగ సమయం కావడంతో కొత్త మోడల్స్ గాజులు వచ్చాయని.. కొన్ని రకాల మోడల్స్ వాట్సాప్ చేసి అతి తక్కువ రేటుకు ఇస్తామని చెబుతూ కొంత మొత్తం డబ్బులు వేయాలంటారు. మిగిలిన మొత్తం స్టాక్ తీసుకొచ్చాక ఇవ్వాలని చెబుతూ మోసానికి పాల్పడుతున్నారు. ఇలా చాలామంది మోసాలకు గురై తమ డబ్బులను పోగొట్టుకుంటున్నారు. అయితే వారు మోసపోయామని చెబితే వారి పరువు పోతుందని పోలీసులకు సైతం ఫిర్యాదు చేయలేని పరిస్థితిలో వ్యాపారులు ఉండిపోతున్నారు.


