కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు తమ్ముళ్లు ప్రకృతి వనరులను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీరికి ప్రజాప్రతినిధుల అండ ఉండటంతో ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొందనే ఆరోపణలున్నాయి.
ఉదయగిరి: కూటమి ప్రభుత్వంలో ఉదయగిరి నియోజకవర్గంలో పచ్చ నేతలు బరితెగిస్తున్నారు. రూ.కోట్ల విలువ చేసే ప్రకృతి సంపదను అక్రమంగా తరలిస్తున్నారు. నిబంధనలు ఖాతరు చేయకుండా మట్టి, గ్రావెల్, ఇసుక, క్వార్ట్ ్జను స్వాహా చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిన సందర్భాల్లో ఎక్కడైనా పట్టుకున్నా జరిమానాలతో సరిపెట్టి వదిలేస్తున్నారు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రకృతి వనరుల అక్రమ తరలింపు జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. ఇరిగేషన్ చెరువులను సైతం వదలకుండా రాత్రింబవళ్లు తేడా లేకుండా జేసీబీలు, ట్రాక్టర్లతో గ్రావెల్, మట్టిని తరలిస్తున్నారు.
యథేచ్ఛగా ఇసుక, మట్టి, గ్రావెల్,
తెల్లరాయి తరలింపు
రూ.కోట్ల విలువైన సంపద లూటీ
ఉదయగిరి నియోజకవర్గంలో
ఇదీ పరిస్థితి
ఏం చేశారంటే..
మంగళవారం కలిగిరి మండలం తెల్లపాడు ఇరిగేషన్ చెరువు నుంచి జేసీబీలతో ట్రాక్టర్ల ద్వారా మట్టి, గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు.
వింజమూరు, ఉదయగిరి, దుత్తలూరు, కలిగిరి మండలాల్లో గ్రావెల్ దోపిడీ కొనసాగుతోంది. దీని వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందనే విమర్శలతో అధికారులు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వింజమూరు మండలం జనార్ధనపురంలో సోమవారం అక్రమంగా తరలిస్తున్న క్వార్ట్ ్జ లారీని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే నామమాత్రపు కేసు నమోదు చేసి మైనింగ్ అధికారులకు అప్పగించారు. స్వల్ప జరిమానాతో తప్పించుకునే అవకాశం ఏర్పడిందనే ఆరోపణలున్నాయి.
పిల్లాపేరు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఆ ప్రాంతం గుల్లగా మారుతోంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో ఇదే తరహా అక్రమ దోపిడీ జరుగుతున్నా అడ్డుకునే ధైర్యం అధికారులకు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.


