● 22న కలెక్టరేట్ ఎదుట ధర్నా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘నేతన్న నేస్తం’ పథకం అమలు చేయాలని ఏపీ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. నగరంలోని మన హాస్పిటల్లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర కన్వీనర్లు బండారు ఆనంద్ ప్రసాద్, బాలకృష్ణ, పూర్ణచంద్రరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. 50 సంవత్సరాల వయసు నిండిన ప్రతి కార్మికుడికి పింఛన్ ఇవ్వాలన్నారు. చేనేత పరిశ్రమకు విధిస్తున్న జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేనేతలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. న్యాయమైన కోర్కెల సాధన కోసం ఈనెల 22వ తేదీన కలెక్టరేట్ వద్ద శాంతియుత ధర్నా నిర్వహిస్తామన్నారు. జిల్లాకు చెందిన చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, శంకరయ్య, పముజుల దశరథరామయ్య, బూదాటి రాధయ్య, రామసుబ్బయ్య, పడవల వెంకటశేషయ్య, వైఎస్సార్సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు రాజా, రవి, హరి తదితరులు పాల్గొన్నారు.


