బీఎస్‌ఎన్‌ఎల్‌ శుభవార్త | - | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ శుభవార్త

Jun 7 2026 9:30 AM | Updated on Jun 7 2026 9:30 AM

నెల్లూరురూరల్‌: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త సిమ్‌ కార్డు వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ తీసుకునే వారు రూ.249 విలువైన తొలి రీచార్జ్‌ను కేవలం రూ.51లకే పొందవచ్చునని జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక ఆఫర్‌ ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ రీచార్జ్‌తో వినియోగదారులు ప్రతి రోజు అపరిమిత వాయిస్‌ కాల్స్‌తోపాటు రోజుకు 2 జీబీ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చునని తెలిపారు. కొత్త సిమ్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్లు, ఫ్రాంచైజీలు, అధీకృత రిటైలర్ల, డైరెక్ట్‌ సెల్లింగ్‌ ఏజెంట్ల వద్ద పొందవచ్చని అధికారులు తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం ఇంటి వద్దకే సిమ్‌ డెలివరీ సేవను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా సిమ్‌ బుకింగ్‌ చేసుకుని ఈ సేవను పొందవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ ప్రత్యేక అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాజరాజేశ్వరి

అమ్మవారి సేవలో..

నెల్లూరు(బృందావనం): నగరంలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారిని రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్‌ మురళీమోహన్‌ కుటుంబసమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ప్రధానార్చకుడు, వేదపండితులు, అర్చకులు ఆహ్వానించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనాలను అందజేశారు. శేష వస్త్రాలను బహూకరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈఓ కోవూరు జనార్దన్‌రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్‌ ఏలూరు శిరీష తదితరులు పాల్గొన్నారు.

పదిన జెడ్పీ

సర్వసభ్య సమావేశం

నెల్లూరు(పొగతోట): డీఆర్సీ మీటింగ్‌ను ఈ నెల పదో తేదీ ఉదయం పది గంటలకు నిర్వహించనున్న తరుణంలో, జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని జెడ్పీ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 2.30 నుంచి నిర్వహించనున్నామని సీఈఓ శ్రీధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత అజెండా మేరకు సమావేశాన్ని నిర్వహించనున్నామని, జెడ్పీ సభ్యులు, ఆయా శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని కోరారు.

ఆర్టీసీ బస్సులో

గంజాయి అక్రమ రవాణా

బిహార్‌ వాసులు ఇద్దరి అరెస్ట్‌

నెల్లూరు(క్రైమ్‌): ఆర్టీసీ బస్సులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న బిహార్‌ వాసులు ఇద్దర్ని ఎకై ్స జ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ నెల్లూరు – 1 ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌బాబు తన సిబ్బందితో కలిసి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం సమీపంలో వాహన తనిఖీలను శనివారం నిర్వహించారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అనుమానాస్పదంగా ఉన్న బిహార్‌లోని శరణ్‌ జిల్లాకు చెందిన అనీష్‌కుమార్‌, అమిత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి బ్యాగుల్లో 8.798 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుల ను ఎకై ్సజ్‌ స్టేషన్‌కు తరలించి విచారించారు. రాజమహేంద్రవరంలో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయిని కొనుగోలు చేసి తిరుపతిలో అధిక ధరలకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నామని నిందితులు వెల్లడించారు. దీంతో వీరిని అరెస్ట్‌ చేశామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఎకై ్సజ్‌ ఎస్సై మురళీకృష్ణ, హెచ్‌సీలు కృష్ణయ్య, కానిస్టేబుళ్లు రఫీ, అజీజ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

15 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 84,468 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 40,203 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.48 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement