నెల్లూరు (టౌన్): విద్యాశాఖలో జరుగుతున్న వరుస వైఫల్యాలపై పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక వీఆర్సీ సెంటర్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో ఎన్టీయే పూర్తిగా విఫలమైందన్నారు. నీట్ పరీక్ష పత్రం లీకేజీ, యూజీసీ నెట్ దరఖాస్తుల నిర్వహణ, సీబీఎస్ఈ పరీక్షల మూల్యాంకనంలో లోపాలు, సీయూఈటీ యూజీ పరీక్షలను చివరి నిమిషంలో రద్దు చేయడం లాంటి ఘటనలు జరిగాయన్నారు. నీట్ పేపరు లీక్పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్.మస్తాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేంద్ర, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహం, విద్యార్థి సంఘాల నాయకులు శివం, యస్దానీ, సోహిల్, మౌళి, నాగేంద్ర, దినేష్, అమర్ తదితరులు పాల్గొన్నారు.


