నెల్లూరు (టౌన్): విద్యాసంస్థలకు చెందిన బస్సుల్లో భద్రతా ప్రమాణాలను పాటించాలని నెల్లూరు ఆర్టీఓ మదాని తెలిపారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు చెందిన బస్సులను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్సుల్లో వీఎల్టీడీ, డ్యాష్బోర్డు కెమెరాలు అమర్చడం, 60 ఏళ్ల వయస్సు మించని, అనుభవం కలిగిన డ్రైవర్లను నియమించాలన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు బ్రీత్ ఎనలైజర్లను ఏర్పాటు చేసుకోవాలని, రవాణాశాఖ చెక్లిస్టులో పేర్కొన్న భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 642 బస్సులను తనిఖీ చేసి ప్రమాణాలు సక్రమంగా లేని 337 బస్సులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. బస్సులకు ఏటీఎస్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని, లేకుంటే కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నెల్లూరు, కావలి రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.


